Asianet News TeluguAsianet News Telugu

YSR Vahana Mitra : ఆటోవాలా యూనిఫామ్ వేసుకుని.. ఆటో నడిపిన సీఎం వైయస్ జగన్..(వీడియో)

వైఎస్స్ వాహనమిత్ర నాలుగో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో జగన్ ఆటోవాలా యూనిఫాం ధరించి పాల్గొన్నారు. 

CM YS Jagan wearing auto wala uniform in YSR Vahana Mitra programme
Author
Hyderabad, First Published Jul 15, 2022, 2:05 PM IST

విశాఖ పట్నం : వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2022-23 లబ్దిదారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. లబ్ధి దారులైన డ్రైవర్ల ఖాతాల్లో రూ.10వేలు జమ చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. వాహన మిత్ర చెక్కులను కొందరు లబ్ది దారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడత వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. దీని ద్వారా నగదు వారి ఖాతాల్లోకి ఏపీ సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. 

నాలుగో విడత నగదు జమ...
2022-23సంవత్సరానికి గాను రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబీ డ్రైవర్లకు వైఎస్సార్ వాహనమిత్రలో భాగంగా దాదాపు 2,61,516 మంది అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో నాలుగో విడతలో రూ.261.51 కోట్ల వరకు జమ చేయనున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు (2019-20, 2020-21,2021-22) వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించారు. ఈ నాలుగేళ్లలో ఏకంగా 10.25లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. 

శుక్రవారం ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలకారు. ఆ తరువాత జగన్ రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి ఏయూఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. అక్కడ జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ పదివేల ఆర్థిక సహాయం విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ లాగా యూనిఫామ్ వేసుకుని పాల్గొనడం అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమం తరువాత తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి జగన్ వెళ్లనున్నారు. అక్కడ నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios