పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష... కీలక నిర్ణయాలివే
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్గ్ గ్రామీణాభివృద్ది, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
అమరావతి: వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. దీనికోసం ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీ సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెడుతుందని సీఎం పేర్కొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాదీ హామీ కింద చేపట్టిన అన్ని కార్యక్రమాలు ఈ ఏడాది పూర్తి కావాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలన్నారు. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని సీఎంకు వివరించారు అధికారులు. ఈ క్రమంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సీఎం వారికి సూచించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్లు ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు.
read more ఆస్తుల కేసు: డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్
పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని సూచించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాలు వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు.
డోర్ టు డోర్ వ్యర్ధాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్ అంబాసిడర్స్, 4482 గ్రీన్ గార్డ్స్ వున్నారన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్స్, 5551 మంది గ్రీన్ గార్డ్స్ ఏర్పాటుకు సీఎం అమోదం తెలిపారు. వ్యర్ధాల నిర్వహణకు భారీగా యంత్రాల వినియోగానికి నిర్ణయించారు. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్ధాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
9148 ఇన్సినిరేటర్స్, 3279 మిస్ట్ బ్లోయర్స్, 3197 బ్రష్ కట్టర్స్, 3130 హైప్రెషర్ టాయ్లెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని అధికారులకు సూచించారు. వ్యర్ధాల సేకరణ వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలని సూచించారు. పీపీఈ కిట్స్ డిస్పోజల్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ పి రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.