ఇవాళ(గురువారం) ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై చర్చించారు. 

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ ను సీఎం జగన్ కోరారు. హైదరాబాద్‌లో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ కార్యకలాపాలు లేవు కాబట్టి ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన ఇబ్బందిగా మారిందన్నారు. సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని... అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలన్న సీఎం కేంద్రమంత్రిని కోరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశంపై వీరిమద్య విస్తృత చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సిన అవసరాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కు వివరించారు సీఎం జగన్. 

 పోలవరం పీపీఏ, కేంద్ర జలమండలి సిఫార్సులతో పాటు కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి (టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ–టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం జగన్. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతో పాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని... వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలన్న సీఎం కోరారు. 

read more ఢిల్లీలో జగన్ బిజీబిజీ: కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సప్లైని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నామని... జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలన్నారు సీఎం. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దని సూచించారు. 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్‌ అండ్ రీ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని సీఎం జగన్ కేంద్ర మంత్రి షెకావత్ ను కోరారు.



అంతకుముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో కూడా సీఎం జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని జగన్ కోరారు.