ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర పెట్టుబడుల మండలి చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిందాల్ స్టీల్కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న చక్కెర మిల్లుల పునరుద్దరణపై సమీక్షించనున్నారు.
విశాఖపట్నలో మార్చి మొదటివారంలో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్పై కేబినెట్లో చర్చ జరగనుంది. మోడల్ స్కూల్స్,రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. టీటీడీకి సంబంధించి పలు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై కూడా కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విశాఖపట్నంకు పరిపాలన రాజధాని తరలింపు అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.