సీటు కోసం బాబు రాజకీయంగా ఎవరినైనా చంపుతాడు: పోసాని సంచలనం
బాబును ఏకేసిన పోసాని కృష్ణమురళి
హైదరాబాద్: తన సీటు కోసం, పదవి కోసం రాజకీయంగా ఎవరినైనా చంపేసే మనస్తతత్వం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నైజమని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అభిప్రాయపడ్డారు.
సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకి రావడం కోసం బాబు ఎంతకైనా దిగజారుతాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ చావుకు కూడ బాబే కారణమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమంటే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమేనా అని ఆయన ప్రశ్నించారు.
23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు టిడిపిలోకి ఫిరాయించేలా ప్రయత్నించారని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసుకు పాల్పడ్డాడని ఆయన చెప్పారు. అయితే ఈ కేసుకు భయపడే ఆ తర్వాత కెసిఆర్ తో రాజీపడ్డారని ఆయన చెప్పారు.వైసీపీకి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టేనని లోకేష్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
టిడిపికి ఓటేస్తే కమ్మ సామాజిక వర్గానికి ఓటేసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చెప్పిన దానిలో తప్పేమీ లేదన్నారు.ఇంతకాలం పాటు బిజెపితో ఎలా మనగలిగావని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు 1999లో వాజ్పేయ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశావన్నారు. ఆనాడు కమ్యూనిష్టులను వదిలేసి బిజెపితో చేతులు కలిపిన విషయాన్ని ప్రస్తావించారు. 2004 తర్వాత బిజెపితో తెగదెంపులు చేసుకొన్నాక కమ్యూనిష్టులతో కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కమ్యూనిష్టులకు గుడ్ బై చెప్పి బిజెపితో పొత్తు పెట్టుకొని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అవసరం కోసం రాజకీయంగా ఎవరినైనా చంపేందుకు వెనుకాడని నైజం చంద్రబాబునాయుడుదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కు విలువలు లేవని చెప్పిన చంద్రబాబునాయుడు .. ఆ తర్వాతే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎన్టీఆర్ విలువలున్న నాయకుడిగా తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఈ విషయంలో తమ అభిప్రాయాలను చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.