శ్రీగౌతమి కేసు: త్వరలోనే కీలక విషయాలు, పెళ్లేక్కడ చేసుకొన్నారు?
బుజ్జికి శ్రీగౌతమికి మధ్య పెళ్లి ఎక్కడ జరిగింది, త్వరలోనే కీలక విషయాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన శ్రీ గౌతమి హత్య కేసులో రెండు మూడు రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్టయ్యారు. అయితే శ్రీగౌతమిని బుజ్జి ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకొన్నారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీగౌతమిది హత్య కాదని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన పోలీసులపై ఇప్పటికే సస్పన్షన్ వేటు పడింది.
గత ఏడాది జనవరి 18వ తేదీన నరసాపురానికి చెందిన శ్రీగౌతమి హత్యకు గురైంది. శ్రీగౌతమిని వివాహం చేసుకొన్న బుజ్జి పథకం ప్రకారంగా ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని సీఐడీ అధికారులు ప్రకటించారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత ఏడాదిలోనే శ్రీగౌతమి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. అయితే పావని మాత్రం తన సోదరిని హత్య చేశారని చెప్పింది. కానీ, ఆ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. రోడ్డు ప్రమాదంలోనే శ్రీగౌతమి మరణించిందని తేల్చి చెప్పారు.
శ్రీగౌతమి హత్య కేసులో ఏడుగురి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఇందులో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు.శ్రీగౌతమిని యాక్సిడెంట్ చేసినందుకుగాను సందీప్, ప్రసాద్లను కూడ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.ఈ మేరకు కోర్టు అనుమతిని కూడ కోరారు. లక్ష్మన్ అనే కారు డ్రైవర్ కోసం కూడ పోలీసులు గాలింపు చేపట్టారు.
టీడీపీ నేత బుజ్జి ఎప్పుడు శ్రీగౌతమిని వివాహం చేసుకొన్నాడు.. ఎక్కడ చేసుకొన్నాడు.. ఈ వివాహనికి ఎవరెవరు సాక్ష్యులుగా ఎవరెవరున్నారనే విషయాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.శ్రీగౌతమితో పాటు బుజ్జికి మధ్య జరిగిన సంభాషణ, వాట్పాప్ చాటింగ్కు సంబంధించిన సమాచారం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదు.
ఈ కేసులో రెండు మూడు రోజుల్లోనే మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని పాలకొల్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. 50 శాతం మాత్రమే దర్యాప్తు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. శ్రీగౌతమిని హత్య చేసేందుకు వచ్చిన నిందితులకు నరసాపురం ప్రాంతంలో ఎవరు ఆశ్రయమిచ్చారు.. ఎక్కడ ఆశ్రయమిచ్చారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.