కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు : నిఘా వైఫల్యం వల్లే దారుణం.. సీఐ, ఏఎస్సైలపై వేటు
నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో నంద్యాల టూ టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. వన్టౌన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఏఎస్సై కృష్ణారెడ్డిని వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నంద్యాల టూ టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. సురేంద్ర కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లుగా అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో నిఘా వైఫల్యం కారణంతోనే సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. వన్టౌన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఏఎస్సై కృష్ణారెడ్డిని వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సురేంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్. రౌడీషీటర్ సాయికుమార్పై నిఘా లేనందుకే సీఐ, ఏఎస్సైపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇకపోతే.. నంద్యాల పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గూడూరు సురేంద్ర కుమార్ (35) క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతను ఆదివారం రాత్రి విధులు ముగించుకుని డిఎస్పి కార్యాలయం నుంచి మోటార్సైకిల్ పై ఇంటికి వెళుతున్నాడు. థియేటర్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు ఆయనను అటకాయించారు.
ALso Read:నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య, కిడ్నాప్ చేసి, కత్తితో వీపు, గుండెల్లో పొడిచి...
అక్కడే ఉన్న ఓ ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటో డ్రైవర్ పై కత్తి పెట్టి నంద్యాల శివారులోని చెరువు కట్టపైకి తీసుకువెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ ను కత్తితో గుండెలపై, వీపులో పొడిచారు. ఆ తరువాత అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ.. అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. ఆ తరువాత మధ్యలో దిగి పరారయ్యారు. ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్ ను ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న ఎస్పి రఘువీర్ రెడ్డి, డీఎస్సీ మహేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లే ఈ దారుణానికి ఒడిగట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.