Asianet News TeluguAsianet News Telugu

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య, కిడ్నాప్ చేసి, కత్తితో వీపు, గుండెల్లో పొడిచి...

నంద్యాలలో ఓ కానిస్టేబుల్ మీద కొందరు దుండగులు దాడి చేశారు. విధులు ముగించుకుని వెడుతున్న అతడిని కిడ్నాప్ చేసి, ఆటోలో ఎక్కించి, కత్తులతో పొడిచి పరారయ్యారు.

constable brutal murder  in Nandyala
Author
Hyderabad, First Published Aug 8, 2022, 7:52 AM IST

నంద్యాల : నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ ను కొందరు అటకాయించి.. అతి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలు దాటాక చోటుచేసుకుంది. నంద్యాల పోలీసులు, ఆటోడ్రైవర్ తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గూడూరు సురేంద్ర కుమార్ (35) క్లర్క్ గా పని చేస్తున్నాడు.  అతను ఆదివారం రాత్రి విధులు ముగించుకుని డిఎస్పి కార్యాలయం నుంచి మోటార్సైకిల్ పై ఇంటికి వెళుతున్నాడు. థియేటర్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు ఆయనను అటకాయించారు.

అక్కడే ఉన్న ఓ ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటో డ్రైవర్ పై కత్తి పెట్టి నంద్యాల శివారులోని చెరువు కట్టపైకి తీసుకువెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ ను కత్తితో గుండెలపై, వీపులో పొడిచారు. ఆ తరువాత అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ.. అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. ఆ తరువాత మధ్యలో దిగి పరారయ్యారు. ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్ ను ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న ఎస్పి రఘువీర్ రెడ్డి, డీఎస్సీ మహేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లే ఈ దారుణానికి ఒడిగట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి...

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ లో ఇలాంటి ఘటనే ఆగస్ట్ 1న జరిగింది. ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు,పెదాలు కత్తిరించాడు ఓ వ్యక్తి. మామూలుగా పోలీసులను చూస్తేనే ఆమడదూరం పారిపోతారు. అలాంటిది ఏకంగా కానిస్టేబుల్ మీదే దాడి ఎందుకు చేశాడటా.. అంటే.. ఆ కానిస్టేబుల్ తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని తన భార్యను వేధించాడని.. చివరకు ఓ సారి ఒంటరిగా కలిసి ఆమెతో కోరిక తీర్చుకున్నాడని నిందితుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియో తీశాడని.. ఆ తర్వాత ఆ వీడియో చూపిస్తూ.. తరుచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. 

పోలీస్ తో సంబంధం పెట్టుకోకుంటే తమ కొడుకును చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చాడు. దీంతో సదరు వ్యక్తి మరో 12 మందితో కలిసి.. కాపుకాసి పోలీస్ కానిస్టేబుల్‌ను పట్టుకుని.. టార్చర్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ ఝాంగ్ జిల్లాలో జరిగింది.  ఖాసిం హయాత్ అనే కానిస్టేబుల్‌పై మహిళపై దాడి, దోపిడీ, పోర్నోగ్రఫీ సెక్షన్ ల కింద కేసు కూడా పెట్టాడు. అయినా.. ఆ కానిస్టేబుల్ ఆగడాలు ఆగలేదని తెలిపాడు. దీంతో ఎలాగైనా ఖాసిం హయాత్ కు బుద్ది చెప్పాలని.. కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదవులను కత్తిరించారు. ఆ తర్వాత తీవ్రంగా టార్చర్ చేశారు. ఆ కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios