ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ ట్రాప్: సీఐ సస్పెండ్
ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను ట్రాప్ చేసేందుకు యత్నించిన ఓ సీఐను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు
గుంటూరు: ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను ట్రాప్ చేసేందుకు యత్నించిన ఓ సీఐను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. గతంలో కూడ ఇదే తరహా ప్రవర్తన కారణంగా ఆ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. అయినా కూడ అతను పద్దతిని మార్చుకోలేదు.
గుంటూరు జిల్లాలోని తెనాలి కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐను తుళ్లూరు స్టేషన్కు ఇంచార్జీగా నియమించారు. తుళ్లూరు సీఐ బదిలీ కావడంతో మరో సీఐని నియమించే వరకు అతనిని ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈ పోలీస్స్టేషన్లో విధుల్లో చేరిన వారం రోజుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను ఆ సీఐ ట్రాప్ చేశారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మహిళను ఎలక్టానిక్ రశీదు ఇవ్వాలి. సీసీటీఎన్ఎస్కు కూడ ఈ ఫిర్యాదును అనుసంధానం చేయాలి. కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా బాధితురాలిని తాను ఉంటున్న హోటల్ కు రావాలని సూచించారు. బాధితురాలు సీఐ ఉంటున్న హోటల్ కు వెళ్లింది.
ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో ఎస్పీ రాజశేఖర్ బాబు రహస్యంగా విచారణ జరిపించారరు. హోట్ సీసీ పుటేజీ తెప్పించుకొని విచారణ జరిపించారు. ఈ విషయమై ఐజీకి ఎస్పీ నివేదికను పంపారు.దీంతో సదరు సీఐను సస్పెండ్ చేస్తూ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడ ఇదే తరహలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించినట్టుగా కేసు నమోదు కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.