నాపై కూడా కేసు పెడుతారేమో..: కేంద్రంపై చంద్రబాబు ఫైర్
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడం అంటే రాష్ట్ర అధికారాల్లోకి కేంద్రం చొరబడటమేనని వ్యాఖ్యానించారు.
ఒంగోలు: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడం అంటే రాష్ట్ర అధికారాల్లోకి కేంద్రం చొరబడటమేనని వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎన్ఐఏ చట్టం వచ్చినపుడు వ్యతిరేకించిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
ఎవరినో కొట్టాను అంటూ తనపై కూడా కేసులు నమోదు చేస్తారేమో అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మరోవైపు వైఎస్ జగన్ పైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. చిత్తశుద్ధి లేని పాదయాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం లేదని విమర్శించారు. పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలని, రోజుకు 8కి.మీ మేర నడిస్తే దాన్ని పాదయాత్ర అంటారా? అని ప్రశ్నించారు.
గతంలో ఆరోగ్యం సహకరించకపోయినా తాను నడిచి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అటు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు.
ఈబీసీ బిల్లు ఇప్పుడే గుర్తొచ్చాయా అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.