Asianet News TeluguAsianet News Telugu

ప్రచారం చేస్తున్నారా? దౌర్జన్యం చేస్తున్నారా?

  • టీడీపీ ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న కార్యక్రమం ఇంటింటికీ తెలుగుదేశం
  • కార్యక్రమ ప్రచార బాధ్యతలు చేపట్టిన టీడీపీ నేతలు
  • కొన్ని చోట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు
chirala mla amanchi krishna mohan assault woman

ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారా? దౌర్జన్యం చేస్తున్నారా? కొందరు నేతల ప్రవర్తన చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వ్యక్తమౌతున్నాయి.తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు అధికారికంగా ‘ ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.  అయితే పార్టీ నేతలు  మాత్రం ప్రజల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజుల క్రితం పల్లె రఘునాథ రెడ్డి ఓ దళితవాడలో పర్యటించాడు. అక్కడ ఓ దళిత యువకుడిని అవమానించిన సంగతి తెలిసిందే.  తాజాగా.. చీరాల ఎమ్మెల్యే ఓ మహిళ పట్ల దురుసుగా వ్యవహరించాడు. దీంతో.. ప్రచారం విషయం పక్కనపెడితే.. వివాదాలు ఎక్కువౌవుతున్నాయే అంటూ పలువురు టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారట.

అసలేం జరిగిందంటే.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది.

అంతేకాకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ‘నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా’... అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న ఏ బండ్లకు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు.

‘నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావని, నాతోనే వాదన పెట్టుకుంటావా.’.అంటూ ఎమ్మెల్యే ఆవేశంతో మాట్లాడారు. చేపలబండిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టించారు. దీంతో ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios