తన వల్లే ‘సిట్’ విచారణ
తన వల్ల పార్టీ, ప్రభుత్వ ఇమేజి పెరిగిందన్నారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, భూ సమస్యకు పరిష్కారం కావాలనే కోరుకుంటున్నట్లు స్పష్టం చేసారు.
‘విశాఖపట్నం జిల్లాలో భూకుంభకోణంపై తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది’ ఇది తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడి స్పందన. భూకుంభకోణంపై చింతకాయల వ్యాఖ్యలపై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు సిఎంకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా? చింతకాయల వల్ల ప్రభుత్వ, పార్టీ పరువు రోడ్డున పడుతోందంటూ గంటా ఆందోళన వ్యక్తం చేసారు. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదంపై ఈరోజు ఉదయం చంద్రబాబునాయుడు ఇంట్లో సమన్వయ కమిటి సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.
గుట్టుచప్పుడు కాకుండా గంటాతో పాటు మరికొందరు ఎంఎల్ఏలు వేలాది ఎకరాలను కబ్జా చేసేసారు. అదే విషయాన్ని చింతకాయల బాహాటంగానే ఆరోపించారు. దానికితోడు కలెక్టర్ కూడా రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని ప్రకటించటం సంచలనంగా మారింది. దాంతో గంటా తదితరులకు బాగా ఇబ్బందైంది. అదే విషయాన్ని గంటా సిఎంకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. దానిపైనే ఈరోజు చర్చ జరిగింది.
అదే విషయమై ఈరోజు సాయంత్రం చింతకాయల మీడియాతో మాట్లాడుతూ, తన వల్ల పార్టీ, ప్రభుత్వ ఇమేజి పెరిగిందన్నారు. లబ్దిదారులకు న్యాయం జరగాలని, భూ సమస్యకు పరిష్కారం కావాలనే కోరుకుంటున్నట్లు స్పష్టం చేసారు. తాను కోరుకుంటున్నట్లు జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తాను కోరుకుంటున్నదే గంటా కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇక సమస్యే లేదని కూడా చింతకాయల వ్యాఖ్యానించటం కొసమెరుపు.