టిడిపి లోకి వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీను
అంతా సిద్దం, ఇక చేరికే ఆలస్యం
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలుగు దేశం పార్టీ ఏపిలో రాజకీయ చదరంగం మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను దెబ్బతీసేలా వారి అనుచరులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో దివంగత దివంగత వంగవీటి రంగా బావమరిది, వంగవీటి రాధాకు మేనమామ అయిన చెన్నుపాటి శ్రీను ను పార్టీలోకి చేర్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనతో పాటు వంగవీటి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా వున్న చాలా మంది టిడిపిలో చేరనున్నారని సమాచారం.
వంగవీటి రంగా రాజకీయాల్లో వున్న సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన శ్రీను ఆయన మరణం తర్వాత రాజకీయంగా నిశబ్దంగా ఉన్నారు. అయితేయ ఇటీవల ఆయన వైసిపి పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
చెన్నుపాటి శ్రీను ను టిడిపిలోకి తీసుకురావడానికి విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ లు కృషి చేస్తున్నారు. పార్టీలో తగిన స్థానం కల్పించి గౌరవిస్తామని వీరు ఇచ్చిన హామీతో టిడిపిలో చేరడానికి శ్రీను నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చేరికకు ముందు తన అనుచరులతో శ్రీను సమావేశమై సమాలోచనలను జరపనున్నారు.
అయితే కాల్ మనీ కేసుల నుండి బయటపడడానికే శ్రీను టిడిపిలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కేసుల్లో అరెస్ట్ కాకుండా కాపాడతామని టిడిపి నాయకులు హామీ ఇవ్వడంతో చేరికకు శ్రీను సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.