మూడు రాజధానులకు ప్రజలు ఒప్పుకొంటే రాజకీయాల నుండి తప్పుకొంటా: చంద్రబాబు
మూడు రాజధానులపై రెఫరెండానికి వెళ్లాలని ఆయన మరోసారి జగన్ ను కోరారు. ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు.
అమరావతి:మూడు రాజధానులపై రెఫరెండానికి వెళ్లాలని ఆయన మరోసారి జగన్ ను కోరారు. ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతుల ఆందోళనలు ఏడాది పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.అమరావతి ఉద్యమం చేస్తున్నవారంతా వ్యాపారులని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతోందని ఆయన చెప్పారు.
అమరావతిని రాజధానిగా గతంలో జగన్ ఒప్పుకొన్నాడని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడేమో కాదంటున్నాడు.. అందుకే ఆయన ఫేక్ ముఖ్యమంత్రి అని అంటున్నట్టుగా చెప్పారు. ఇప్పటికైనా జగన్ తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 19 నెలలైంది ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.నాకు ఇల్లు లేదంటున్నారు. మీరు ఇల్లు కట్టుకొని ఏం చేశారని ఆయన అడిగారు.
అమరావతి అంటే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు కోపమో చెప్పాలన్నారు. ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు పెడతారు. ఇష్టం లేనప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఆయన జగన్ పై విమర్శలు గుప్పించారు. కులం చూసి హైద్రాబాద్, విశాఖను అభివృద్ది చేయలేదని ఆయన చెప్పారు.
బుద్ది ఉన్నవాడెవడూ కూడ అమరావతిని వద్దనడని ఆయన చెప్పారు. తన దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవన్నారు.ద్రౌపది వస్త్రాపరహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతోందన్నారు.ఇంత పనికిమాలిన దద్దమ్మ ముఖ్యమంత్రిని తాను ఎక్కడా కూడ చూడలేదన్నారు.