బీజేపీయేతర పార్టీలతో  ఫ్రంట్ ఏర్పాటు కోసం  మరోసారి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

అమరావతి: బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు కోసం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీలతో కూటమి కోసం బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు కూడ బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో‌ కూడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సహాయంతో గతంలో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో బాబు కీలకంగా వ్యవహరించారు. 

1996లో కేంద్రంలో యునైటెడ్ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబునాయుడు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా ఉన్న పీవీ నరసింహారావు, సీతారాం కేసరిలతో చర్చించి బీజేపీయేతర పార్టీల కూటమిని కేంద్రంలో ఏర్పాటైంది.

ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఏనాడూ కూడ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలేదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి టీడీపీ ప్రజా కూటమిలో భాగస్వామిగా మారింది. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి బుద్ది చెప్పేందుకు గాను బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు బాబు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇవాళ ఢిల్లీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం కూడ ఇదే.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో టీడీపీ భాగస్వామిగా మారుతోందా.. లేక బీజేపీయేతర పార్టీలతో మరో కూటమిని ఏర్పాటు చేస్తోందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

అయితే బీజేపీయేతర పార్టీలను కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీతలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబు అడుగులు కాంగ్రెస్ వైపుకు దగ్గరగా పడుతున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ కూటమి ఏర్పాటు విషయంలో బాబు ఏ మేరకు సఫలీకృతమౌతారో కాలమే సమాధానం చెబుతోంది.

సంబంధిత వార్తలు

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు