Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు: వైసీపీ ఆరోపణలపై బాబు సవాల్ ఇదీ...

ఎల్జీ పాలీమర్స్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ ఆరోపణలను రుజువు చేయాలని చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
 

Chandrababunaidu challenges to Ysrcp leaders on LG polymers factory permissions
Author
Visakhapatnam, First Published May 12, 2020, 3:48 PM IST


అమరావతి: ఎల్జీ పాలీమర్స్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ ఆరోపణలను రుజువు చేయాలని చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జనరల్ బాడి సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నాడు  నిర్వహించారు. పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు, జనరల్ బాడి సభ్యులు పాల్గొన్నారు.

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో మృతులకు సంతాపంగా  రెండు నిముషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు టిడిపి జనరల్ బాడి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

ఆరు దశాబ్దాల క్రితం నుంచి ఏయే ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు ఇచ్చాయో, అనుమతులు ఇచ్చారో సాక్ష్యాధారాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాకే పాలి స్టైరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ విస్తరణకు అనుమతి ఇచ్చిందన్నారు. కేంద్రానికి సిఫారసు చేసిందనే దానిపై  రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు.

విష వాయువుల లీకేజికి కారణమైన కంపెనీకి వత్తాసు పలుకుతూ బాధితులపై కేసులు పెట్టడాన్నిఆయన ఖండించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేదాకా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. అక్రమ కేసుల్లో చిక్కుకున్న బాధితులకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.

దక్షిణ కొరియాలో ఇదేవిధమైన దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో అంత మొత్తం ఇక్కడకూడా ఇప్పించేలా చూడాలని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ టిడిపి జనరల్ బాడీ ఏకగ్రీవంగా తీర్మాణించింది.

ఈ దుర్ఘటనకు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. ఎల్జీ పాలిమర్స్ ను తక్షణమే అక్కడనుంచి తరలించాలని సమావేశం డిమాండ్ చేసింది.  ఆ భూములలో పార్క్ అభివృద్ది చేయాలి. పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

20డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండాల్సిన స్టైరీన్, 130-150డిగ్రీలకు చేరిందంటే అది కంపెనీ తప్పిదమేనని సమావేశం అభిప్రాయపడింది. సెల్ఫ్ పాలిమరైజేషన్ కు కెమికల్  కలపాల్సివుండగా అది చేయకుండా వదిలేశారు. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాల్సివుండగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాలుష్య నియంత్రణ మండలి, ఫోరెన్సిక్ ల్యాబ్ లు పేర్కొన్న విషయాన్ని సమావేశం గుర్తు చేసింది. 

 విశాఖలో అంతా బాగానే ఉందని వైసిపి మంత్రులు ప్రచారం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.మానవ తప్పిదంతో ఒక కంపెనీ 12మందిని చంపేస్తే, దానికి బాధ్యులైన వాళ్లను అరెస్ట్ చేయకుండా, బాధితులపై కేసులు పెట్టడం కన్నా దుర్మార్గం మరొకటి లేదని బాబు అన్నారు.

ఈ ఘటనపై నిపుణులతో ఎన్ జిటి కమిటి వేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ కమిటిలో నిపుణులను వేయకపోవడమే వైసిపి నాయకులు చిత్తశుద్ది లేమికి నిదర్శనమని బాబు విమర్శించారు. బాధితులు అందరికీ ఒక ఏడాది పాటు వైద్యపరీక్షలు చేయాలని నిపుణులే చెప్పారు. అదే విషయం 3రోజుల ముందే టిడిపి చెబితే దానిపై విమర్శలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

లీకేజి దుర్ఘటనలో 3కిమీ కంటే ఎక్కువ పరిధిలో విష వాయువులు వ్యాపిస్తే, కేవలం 1 కిమీ పరిధిలోని ప్రజలకే ఆర్ధిక సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. చిన్న కాలనీలకే ప్రభుత్వ సాయం పరిమితం చేసి మిగిలిన గ్రామాలవాళ్లను వదిలేయడంపై ఆయన మండిపడ్డారు. 

విష వాయువులు పీల్చి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ లో అసిస్టెంట్ లోకో పైలెట్, గార్డు అస్వస్థతకు లోనైతే అదికూడా అబద్దమేనని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ఖండించారు. రైల్వే ఆసుపత్రి వద్ద రికార్డుల్లో ఉన్నదానిని కూడా అబద్దాలుగా చిత్రించడం హేయమన్నారు. 

‘‘మా కుటుంబాల్లో కూడా చనిపోతే బాగుండు, రూ కోటి వస్తాయని’’ బాధితులే అంటున్నారని వైసిపి ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొనడం అమానుషం. వైసిపి నాయకుల అమానవీయ ధోరణిని ఖండించారు. 

కరోనాతో చనిపోయింది   3 శాతం మందే కదా అనే తేలిక భావంతో వైసిపి నాయకులు మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఈనెల 28నుంచి సిఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని చూడటం హేయమన్నారు.

కోర్టుల ఆదేశాలను వైసిపి ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. కోర్టులో ఒకటి చెబుతున్నారు, బైట ఇంకోటి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయరాదని హైకోర్టు తీర్పు ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. 2జీవోలను కొట్టేసినా మూర్ఖంగా  మళ్లీ వైసిపి రంగులే వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  కరోనా వైరస్ బాధితులకు ప్రాణాలు తెగించి సేవలు అందిస్తున్న నర్సుల సేవలను కొనియాడారు. వైద్య సేవలు అందించేందుకే తమ జీవితాలను అంకితం చేసిన నర్సుల త్యాగాలు చిరస్మరణీయంగా పేర్కొన్నారు. నర్సుల సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది.

 వైసిపి నాయకుల విందులు, ఫ్లెక్సీలతో ట్రాక్టర్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించి కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారు. చౌకడిపోల వద్ద, మద్యం షాపుల వద్ద జనం గుంపులుగా పోగయ్యే దుస్థితి కల్పించారు. ‘‘మీ వల్లనే మా బతుకులు ఇలా మారాయి, మీవల్లే వైరస్ అందరికీ సోకింది’’ అంటూ వైసిపి నాయకులను మహిళలు తరిమికొట్టే పరిస్థితి నెలకొంది. దాతలు ఇచ్చే విరాళాలపై కూడా సీఎం ముద్ర వేసి ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు.

also read:విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు

లాక్ డౌన్ కారణంగా గత 55రోజులుగా రైతులు, పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి కుటుంబానికి రూ5వేలు ఇవ్వాలని టిడిపి నేతలు 12గంటల దీక్షలు చేసినా ప్రభుత్వంలో స్పందనలేక పోవడాన్ని గర్హించారు. 

విదేశాల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఏపికి విమాన సర్వీసులు కూడా నడపలేదు. వీటన్నింటిని ఖండిస్తూ టిడిపి జనరల్ బాడిలో తీర్మానం ఆమోదించారు. వలస కార్మికులను ఆదుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

మద్యం మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా ఇళ్లలోనే 12గంటల దీక్షలు చేస్తున్న మహిళలను టిడిపి జనరల్ బాడి సమావేశం అభినందించింది. నిరసనలు తెలిపిన మహిళలపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. మద్య నిషేధం హామీని చిత్తశుద్దితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ ఛార్జీలు రెట్టింపు చేయడాన్ని ఖండించారు. ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు పెంచారు, మద్యం ధరలు పెంచారు, ఇసుక, సిమెంట్ రేట్లు పెంచేశారు. తొలి ఏడాదిలోనే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెద్దఎత్తున భారాలు మోపడాన్ని నిరసించారు. పెంచిన ఛార్జీలను ఖండిస్తూ తీర్మానం ఆమోదించారు. 


రైతుల వద్ద పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఖండించారు: ధాన్యం, మొక్కజొన్న తదితర ఆహార పంటలు, పత్తి, మిర్చి, పొగాకు, పసుపు వాణిజ్య పంటలు, టమాటా, అరటి, బత్తాయి, పుచ్చ, బొప్పాయి, కర్బూజ పండ్ల ఉత్పత్తులు కొనేవారు లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.రైతాంగాన్ని ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

నదీజలాల్లో మన హక్కులు కాపాడటంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యింది. పోలవరం పనులు నిలిచిపోయాయి. పట్టిసీమపై దుష్ప్రచారం చేశారు, ఆ కాంట్రాక్టర్ కే ఇప్పుడు అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు. 23ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి 32లక్షల ఎకరాలకు సాగునీరు టిడిపి ప్రభుత్వం అందించగా  ఈ ఏడాదిలో అన్ని పనులను నిలిపేశారని బాబు చెప్పారు.

10)తుపాన్ల నుంచి కాపాడే మడ అడవులను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. తుపాన్లనుంచి తీర ప్రాంతాన్ని రక్షణ కవచంలా కాపాడే మడ అడవులను కొట్టేసి, పేదలకు ఇళ్ల జాగాలు ఇస్తామనడం హేయం. ఆవ భూముల్లో 560ఎకరాల సేకరణ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఎకరం రూ 7లక్షలు చేయని భూమిని రూ 45లక్షలకు కొని వైసిపి నాయకులు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.భూముల కొనుగోళ్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు పుట్టిన రోజు సందర్భంగా టిడిపి నాయకులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యనమలతో తన సాహచర్యాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘పార్టీయే మనకు ముఖ్యం, పార్టీ ఉంటేనే మనం అంతా ఉంటామనే’’ నిబద్దతతో యనమల గత 38ఏళ్లుగా పని చేశారు. రాష్ట్రానికి, పార్టీకి సంక్షోభం ఎదురైనప్పుడల్లా తన అనుభవంతో, నిబద్దతతో అండగా నిలిచారని, ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. శాసన సభ్యునిగా పల్లా శ్రీనివాస రావు సేవలను ప్రశంసించారు.

ఈ సమావేశంలో యనమల రామకృష్ణుడు, టిడిఎల్ పి ఉప నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, జయ నాగేశ్వర రెడ్డి, జివి ఆంజనేయులు, కడప శ్రీనివాస రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, నూకసాని బాలాజి, గుంటుపల్లి నాగేశ్వర రావు, రామాంజనేయులు, తదితరులు ప్రసంగించారు.
                                           
 

Follow Us:
Download App:
  • android
  • ios