కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా వుండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి: ఏప్రిల్ 20న అంటే రేపు(మంగళవారం) తన పుట్టినరోజు సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలు జరపకూడదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''నా పుట్టినరోజు వేడుకను ప్రత్యేకంగా నిర్వహించేందుకు మీరు చేసే ప్రయత్నం అభినందనీయం. వేడుకలకంటే ఇప్పుడు భద్రత ఎంతో ముఖ్యం. నా పుట్టినరోజు సందర్భంగా సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇదే మీరు నాకు ఇచ్చే ఉత్తమ బహుమతి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

read more వైఎస్ విజయమ్మ పుట్టినరోజు... కొడుకు, కోడలు దూరం, షర్మిల మాత్రమే

''భారతదేశంలో కరోనా శరవేగంతో విస్తరిస్తూ ప్రమాదకారిగా మారుతున్నందున మనల్ని మనమే రక్షించుకోవాలి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత రక్షణ పొందటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన మూడు సూచనలు అంతా పాటించాలి. ఏసి ఉన్న గదులలో కంటే గాలి, వెలుతురు బాగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరం'' అన్నారు. 

''వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండండి. ఎవరినైనా కలవాల్సివస్తే వారితో గడిపే సమయం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. తెలుగువారంతా ఈ మూడు సూచనలు పాటించి, కోవిడ్ నుంచి వీలైనంత రక్షణ పొందండి'' అంటూ ట్విట్టర్ ద్వారా జాగ్రత్తలు సూచించారు చంద్రబాబు.