Asianet News TeluguAsianet News Telugu

పులివెందులకు ఎంతో చేశాం...కానీ కుప్పంకు: చంద్రబాబు

తన సొంత నియోజవర్గం కుప్పం టిడిపి నాయకులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 

chandrababu tele conference with kuppam tdp leaders
Author
Kuppam, First Published Jun 25, 2020, 9:57 PM IST

చిత్తూరు: తన సొంత నియోజవర్గం కుప్పం టిడిపి నాయకులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల టిడిపి బాధ్యులు, ఏరియా కన్వీనర్లతో చంద్రబాబు మాట్లాడారు. 

''కరోనా, లాక్ డౌన్ లతో అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కోవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. కాబట్టి అందరూ విధిగా మాస్క్ లు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి'' అని చంద్రబాబు సూచించారు. 

''కరోనా కష్టాల్లో పేదలకు బియ్యం, కూరగాయలు, మాస్క్ లు పంపిణీ చేసిన అందరికీ అభినందనలు. లాక్ డౌన్ లో కోవిడ్ నామ్స్ కు అనుగుణంగా పార్టీ పిలుపుమేరకు వివిధ వర్గాల ప్రజల సమస్యలపై వర్ట్యువల్ ఆందోళనలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను అభినందనలు'' తెలిపారు.

''గత ఏడాదిగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ది పనులన్నీ ఆగిపోయాయి. సాగునీరు, తాగునీటి కొరత సృష్టించారు. టమాటా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. హార్టీకల్చర్, సెరికల్చర్ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వైసిపి ఏడాది పాలనలో జలవనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టిడిపి ప్రభుత్వం ఏడాదిలో రూ14వేల కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి రూ4వేల కోట్లు ఖర్చు చేయకపోవడం చేతగాని పాలనకు నిదర్శనం'' అని మండిపడ్డారు. 

''అభివృద్దికి- నిర్మాణానికి టిడిపి ప్రతిరూపం అయితే, అవినీతికి-విధ్వంసాలకు వైసిపి ప్రతిబింబం. టిడిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చాం... చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం. అలాంటిది కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపే. హంద్రీ-నీవా పనులు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపేయడం గర్హనీయం'' అన్నారు. 

read more   51మంది టిడిపి నాయకులు జైలుకు...: టిడిపి ఎమ్మెల్సీ అర్జునుడు

''టిడిపి హయాంలో సాగునీరు, తాగునీటి  సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం, అలాంటిది గత ఏడాదిగా అన్ని సాగునీటి పథకాలను, తాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేశారు. 
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సకాలంలో పూర్తిచేస్తే 110చెరువులకు నీళ్లు అందించే అవకాశం ఉండేది. సాగునీరు,  తాగునీటికి కొరత ఉండేది కాదు. రూ575కోట్ల హంద్రీ-నీవా పనులకు గాను రూ525కోట్ల పనులను టిడిపి ప్రభుత్వం పూర్తిచేయగా, మిగిలిన పనులకు కావాల్సిన  రూ50కోట్లు కూడా విడుదల చేయకుండా నిలిపేయడం దారుణం'' అని పేర్కొన్నారు. 

''టిడిపిపై కక్షతోనో, వ్యక్తిగతంగా నాపై అక్కసుతోనో పనులు ఆపేసి ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం కన్నా దుర్మార్గ చర్య మరొకటి ఉండదు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. లారీ ఇసుక రూ20వేల నుంచి రూ40వేలకు అమ్ముతున్నారు. అన్ని గనులను వైసిపి నాయకులే ఆక్రమించారు. నాసిరకం మద్యం బ్రాండ్లను అధిక ధరలకు అమ్ముతున్నారు, ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''ఇళ్లస్థలాల ముసుగులో రూ1600కోట్ల స్కామ్ చేశారు. ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. సంక్షేమంలో తప్పుడు లెక్కలతో పేదలను మోసం చేస్తున్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వైసిపి అవినీతి అరాచకాలను ఎండగట్టాలి'' అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. 

టిడిపి హయాంలో సుజల పథకం కింద లీటర్ రూ2కే తాగునీరు అందించగా దానిని రూ5కు పెంచేశారని, టిడిపి హయాంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జిని తామే తెచ్చామని వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారని, గ్రామంలో 40ఆటోలుంటే ఇద్దరికే ఆర్ధిక సాయం ఇచ్చారని ఏరియా కన్వీనర్లు చంద్రబాబుకు తెలిపారు.   10% మందికి ఆర్ధిక సాయం ఇచ్చి 90%మందికి ఎగ్గొట్టారని, అందరితోపాటు ఇచ్చే పథకాలను కూడా కలిపేసి కార్పోరేషన్ల ఖర్చులో చూపించి ఆయా వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. 

వేరుశనగ విత్తనాల పంపిణిలో కూడా విఫలం చెందారని, నాసిరకం విత్తనాలు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్, ఏరియా కన్వీనర్లు, మండల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios