బాబు లీక్: జగన్ పార్టీ ఎంపీల రాజీనామాల ఆమోదం ఎప్పుడంటే...
తెలుగుదేశం శాసనసభ పక్ష (టీడీఎల్పీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తెలుగుదేశం శాసనసభ పక్ష (టీడీఎల్పీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను జూన్ 2వ తేదీ తర్వాత ఆమోదించే అవకాశం ఉదని చెప్పారు. ప్రత్యేక హోదాను ఇవ్వనందుకు నిరసనగా వైసిపి ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓసారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే టీడీపీ ఏడు స్థానాలు గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. వైసిపి, బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
కర్ణాటకలో ఎపిఎన్జీవో నేత అశోక్ బాబుపై వైసిపి కార్యకర్తలే దాడి చేశారని ఆయన ఆరోపించారు. అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతను మంత్రులు, శాసనసభ్యులు తీసుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా, బెల్టు షాపులుపై బాధ్యత పార్టీ నాయకులదేనని అన్నారు.