సతీసమేతంగా హైదరాబాద్ కు చంద్రబాబు... ఏ హాస్పిటల్లో చికిత్స పొందనున్నారంటే...
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యం కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటికే ఆయనను కలిసిన వైద్యుల బృందం నేడు పలు టెస్టులు చేయనున్నారు.

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇలా జైలునుండి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లో చికిత్స చేయించుకునేందుకు సిద్దమయ్యారు.
బుధవారం సాయంత్రమే భార్య భువనేశ్వరితో కలిసి ప్రత్యేక విమానంతో హైదరాబాద్ కు బయలుదేరారు చంద్రబాబు. శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏఐజి హాస్పటల్ డాక్టర్ల బృందం చంద్రబాబు ఇంటికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు నేడు ఏఐజి హాస్పిటల్ కు వెళ్లనున్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఏఐజి హాస్పిటల్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న ఏఐజి వైద్యులు అందుకు సంబంధించిన పరీక్షలు చేసి తగిన వైద్యం అందించనున్నారు. చంద్రబాబు వైద్యపరీక్షల కోసం ఏఐజి హాస్పిటల్లో అన్నిఏర్పాట్లు చేసారు.
Read More చంద్రబాబు చల్లగా వుండాలనే కోరుకుంటున్నాం..: మంత్రి బొత్స సత్యనారాయణ
వైద్యం చేయించుకునేందుకు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు స్పష్టంగా సూచించింది... కాబట్టి చంద్రబాబు రాజకీయాలకు దూరంగా వుండనున్నారు. అలాగే కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని సూచించారు. ఇలా చంద్రబాబుకు పలు షరతులు విధించిన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే రాజమండ్రి జైలునుండి విడుదలైన చంద్రబాబును చూసేందుకు టిడిపి శ్రేణులు, ప్రజలు బారులు తీరారు. రాజమండ్రి నుండి ఉండవల్లి నివాసానికి చేరుకునేందుకు చంద్రబాబుకు 14 గంటలు పట్టిందంటేనే ఎలాంటి స్వాగతం దక్కిందో అర్థంచేసుకోవచ్చు. దారిపొడవున్నా పసుపు జెండాలు పట్టుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలు... అమరావతి ప్రాంతానికి చేరుకోగానే మహిళలు మంగళహారతులతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు కారుపై పూలవర్షం కురిపించారు.
ఇంటికి చేరుకున్న చంద్రబాబుకు భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో హారతిపట్టారు. అనంతరం పండితులు గుమ్మడికాయతో హారతిపట్టి దిష్టిపట్టారు. ఇంట్లోకి చేరుకున్న ఆయన ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నారు. అనంతరం కుటుంబంతో గడిపారు.