ఓ ప్రముఖ మీడియా సంస్థకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన వృద్ధి గురించి,కృషి ,మోడీ నాయకత్వంలోని అభివృద్దిని వివరించడంతో పాటు...2047 నాటికి వికసిత భారత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ముఖ్యాంశాలు ప్రస్తావించారు. దేశ అభివృద్ధిలో తన పాత్రను వివరించిన ఆయన, తానే రెండో తరం ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకొచ్చానని అన్నారు.
విద్యుత్ కూడా లేని..
తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఓ గ్రామంలో విద్యుత్ కూడా లేని రోజుల్లో తన జీవితాన్ని ప్రారంభించానని చెప్పారు. అప్పటినుంచి అభివృద్ధి దిశగా ఎప్పటికప్పుడు ముందుగా ఆలోచిస్తూ పనిచేశానని తెలిపారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలవగా, తాను 1995లో సీఎం అయిన తర్వాత రెండో దశ సంస్కరణలకు బాటలు వేసినట్లు గుర్తు చేశారు.
వాజ్పేయి ప్రధాని అయిన కాలంలో టెలికం రంగానికి తెరలేపిన విధానాల్లో తాను కీలకపాత్ర పోషించానన్నారు. అప్పట్లో చైనాలో మొబైల్ ఫోన్లు విస్తృతంగా వస్తున్నాయన్న సంగతి తెలుసుకొని, మన దేశంలోనూ అలాంటి మార్పు తీసుకురావాలన్న ఆలోచన తనదే అని వివరించారు. దీనిపై ఒక నివేదిక రూపొందించి వాజ్పేయికి సమర్పించగా, ఆయన దానిని ఆమోదించారని చెప్పారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పారు. గురుగ్రామ్, పూణె, చెన్నై వంటి నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని హైదరాబాద్ వరకు విస్తరించామన్నారు. ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు కూడా తన ప్రణాళికల ఫలమని తెలిపారు.
సరైన నాయకుడు..
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, దేశ అభివృద్ధికి ఆయన సరైన నాయకుడు అని అభిప్రాయపడ్డారు. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో ఉండగా, ఇప్పుడు నాలుగో స్థానం సాధించిందని గుర్తు చేశారు. ఇది మోడీ నాయకత్వంలోని స్థిరమైన ప్రభుత్వ ఫలమని అన్నారు.
గ్లోబల్ హబ్గా…
భవిష్యత్తులో భారత్ సేవల రంగంలో గ్లోబల్ హబ్గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్కు భారత్లో జరిగిన అభివృద్ధిని వివరించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయనకు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇండియాలోని టెక్నాలజీ పురోగతిని చూపించానని, హైదరాబాదులో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆయన అంగీకరించారని తెలిపారు.
ఇంకా, హైదరాబాద్ను గ్రీన్ఫీల్డ్ సిటీగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఫార్మా, ఫైనాన్స్, స్పోర్ట్స్ రంగాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టానని, అమరావతిని భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.