ఏపీ మొత్తం ఢిల్లీ వీధుల్లో...: పాదయాత్రలో చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి దక్కాల్సిన హక్కుల కోసం అవసరమైతే కోర్టుకు కూడ వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి దక్కాల్సిన హక్కుల కోసం అవసరమైతే కోర్టుకు కూడ వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ భవన్ నుండి మంగళవారం నాడు చంద్రబాబునాయుడు ఏపీకి చెందిన మంత్రులు, అధికారులు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి రాష్ట్రపతి భవన్కు పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రం మొత్తం ఢిల్లీ వీధుల్లో నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు నమ్మకద్రోహం చేసిందన్నారు. ఏపికి జరిగిన అన్యాయానికి అందరూ మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు.
నమ్మించి ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకొంటున్నారని బాబు విమర్శించారు. ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకొంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
ఏపీ ఢిల్లీకి దూరంగా ఉందని తమను ఏం చేయలేరని భావిస్తే కేంద్రం గుండెల్లో నిద్రపోతామన్నారు. అవసరమైతే కోర్టుకు కూడ వెళ్తామని బాబు స్పష్టం చేశారు. మరో వైపు ప్రజా క్షేత్రంలో తేల్చుకొంటామన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రత్యేక హోదాను సాధించుకొంటామన్నారు. వైసీపీ చీఫ్ జగన్, మోడీలు ఇద్దరూ ఒక్కటేనని ఆయన చెప్పారు.మోడీ అభీష్టాన్ని జగన్ ఆచరిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.కేసుల నుండి మాఫీ చేసుకొనేందుకు జగన్ను మోడీకి ఊడిగం చేస్తున్నారన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసం తాను ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేసినట్టు బాబు చెప్పారు. ఎన్డీఏ సర్కార్ ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దొంగలుగా చిక్కారన్నారు. పోలవరానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులను ఇవ్వాలన్నారు.
బీజేపీతో కలిసి వైసీపీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో రానున్న ప్రభుత్వం అవినీతి పరులను శిక్షిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం తరహాలో అవినీతిపరులను రక్షించదని ఆయన తేల్చి చెప్పారు.జంతర్మంతర్ వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడి నుండి చంద్రబాబుతో పాటు మరో 11 మంది రాష్ట్రపతి భవన్కు బయలు దేరారు.
సంబంధిత వార్తలు
రాష్ట్రపతి భవన్కు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు