దేశ రాజధాని న్యూడిల్లీలో కూర్చుని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇకపై శాశ్వతంగా అమరావతే రాజధానిగా ఉండేలా ఆయన పావులు కదుపుతున్నారు. 

 

Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) డిల్లీలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ఎంపీలతో కలిసి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మొదట కేంద్ర పునరుత్పాదక ఇందనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పాటు మరికొందరు మంత్రులను కలిసింది చంద్రబాబు టీమ్.

ఈ సందర్భంగా మంత్రులతో చర్చించిన అంశాలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలో చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కేవలం సముద్రంలో కలిసే నీటినే ఈ ప్రాజెక్టు ద్వారా వాడుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఇక పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ముంగింపు దశకు చేరుకోవాల్సింది... కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోవడంతో పాటు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిపాలయ్యిందని అన్నారు. నాణ్యతతో రాజీలేకుండా పోలవరం నిర్మిస్తాం... ఇందుకోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని చంద్రబాబు అన్నారు.

ఇక ఉగ్రవాదులు ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత పాకిస్థాన్ కు ధీటుగా జవాబు ఇచ్చిన భారత ఆర్మీని అభినందించారు చంద్రబాబు... ఈమేరకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అభినందనలు తెలిపారు. ఇక రాష్ట్రంలో రక్షణశాఖ పెట్టుబడులు పెట్టాలని... జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్ లో మిస్సైల్ ఇండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్, లేపాక్షి-మడకశిక క్లస్టర్లో మిలిటరీ ఆండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు తెలిపారు.

ఇక విశాఖ-అనకాపల్లి క్లస్టర్లో నేవల్ ఎక్స్పర్మెంట్ కేంద్రం, కర్నూల్-ఓర్వకల్లు క్లస్టర్లో మిలిటరీ, డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ఇలా రాష్ట్రంలో రక్షణ శాఖ పెట్టుబడులకు ముందుకు రావాలని... ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆర్మీ కంటోన్మెంట్ పెట్టాలని ప్రతిపాదించినట్లు చంద్రబాబు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సూర్యఘర్ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని చూస్తున్నామని.. నియోజకవర్గానికి 10వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. సూర్యఘర్ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ అమలు చేస్తామని... మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసారు. అలాగే వివిధ పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పనులకు నిధులిచ్చి అండగా నిలవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.