అవిశ్వాసంపై పక్కా ప్లాన్తో బాబు: ఎంపీలకు ఫీడ్ బ్యాక్
కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా చర్చ జరిగే సమయంలో పూర్తి ఆధారాలను పార్లమెంట్ వేదికగా బయటపెట్టాలని టీడీపీ భావిస్తోంది.ఈ మేరకు ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకు గాను చంద్రబాబునాయుడు అధికారులతో సమావేశమయ్యారు.
అమరావతి: కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా చర్చ జరిగే సమయంలో పూర్తి ఆధారాలను పార్లమెంట్ వేదికగా బయటపెట్టాలని టీడీపీ భావిస్తోంది.ఈ మేరకు ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకు గాను చంద్రబాబునాయుడు అధికారులతో సమావేశమయ్యారు.
బుధవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, ఇప్పటివరకు ఏ మేరకు నిధులు వచ్చాయనే విషయమై లెక్కలు తీస్తున్నారు. సమగ్రమైన సమాచారం ఇవ్వాలని అధికారును బాబు ఈ సమావేశంలో ఆదేశించారు.
పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా జరిగే చర్చలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా విన్పించేందుకుగాను టీడీపీ ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని సీఎంఓ అధికారులు తయారు చేస్తున్నారు.
ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని ఎల్లుండిలోపుగా అందజేయనున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాసంపై తీర్మాణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించనున్నారు.అయితే అవిశ్వాసంపై టీడీపీ తరున ఎవరెవరు మాట్లాడాలనే విషయమై చంద్రబాబునాయుడు ఇవాళ రాత్రికి పేర్లను ఖరారు చేయనున్నారు.
చట్టంలో ఉన్నదేమిటీ, కేంద్రం ఏ మేరకు రాష్ట్రానికి సహాయం చేసిందనే విషయాలను అంకెలతో సహ వివరించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.ఈ మేరకు లోతుగా అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. నాడు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అంటే ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందనే విషయాలను కూడ పార్లమెంట్ వేదికగా కూడ వివరించనున్నారు.
అవిశ్వాసంపై జరిగే చర్చ సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావించాలనే దానిపై కూడ బాబు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఎంవో అధికారులతో బాబు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు.
విభజన చట్టం హామీలు, ఇప్పటివరకు అమలు జరిగిన తీరు, ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్థికలోటు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులు.. రావాల్సిన నిధుల గురించి ఫైనాన్స్ సెక్రటరీ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు.
వీటితోపాటు.. దుగరాజపట్నం పోర్ట్, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వేజోన్, ట్రైబల్ యూనివర్సిటీ వంటి హామీల పురోగతిపై చర్చించారు. వీటన్నింటికి సంబంధించి ఎంపీలకు తగిన సమాచారం అందజేయాలని అధికారులకు సూచించారు. 18 అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా 10 అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని టీడీపీ తలపెట్టింది.