నిరుద్యోగులకు శుభవార్త...డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి?
- నిరుద్యోగ భృతి హామీని మొత్తానికి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఎప్పుడైతే ముందస్తు ఎన్నికల వాతావరణం మొదలైందో నిరుద్యోగ భృతి ఫైలుకు చంద్రబాబు దుమ్ము దులిపారు.
- రానున్న డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది
గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని మొత్తానికి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి నిరుద్యోగులు అత్యధికులు టీడీపీకి ఒటు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అధికారంలోకి రాగానే ఆ హామీని చంద్రబాబు పక్కనపడేశారు. దీంతో నిరుద్యోగులు, ప్రతిపక్షాలు చంద్రబాబుని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే.. నిరుద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా..అటు ఉద్యోగాలు ఇవ్వక, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక మూడున్నర సంవత్సరాలు గడిపేసింది చంద్రబాబు ప్రభుత్వం. అటువంటిది ఎప్పుడైతే ముందస్తు ఎన్నికల వాతావరణం మొదలైందో నిరుద్యోగ భృతి ఫైలుకు చంద్రబాబు దుమ్ము దులిపారు. రానున్న డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది నిరుద్యోగులున్నారు.?ప్రతి నెల ఎవరెవరికి ఎంత మొత్తంలో భృతి చెల్లించాలి? అనే విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. నిరుద్యోగభృతి చెల్లింపు కారణంగా రాష్ట్ర ఖజానాపై ఎంతభారం పడనుందనే విషయాలపై కూడ సర్కార్ లెక్కలు తీసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇది అదనపు భారమైనప్పటికీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హామీని అమలు చేయడం తప్పనిసరి అయ్యింది.
నిరుద్యోగుల్లో పీజీ చేసిన వారికి ప్రతి నెల రూ. 2 వేలు, గ్రాడ్యుయేట్లకు రూ.1500, ఇంటర్ చదువుకున్న వారికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది నిరుద్యోగు లు ఉన్నట్లు అంచనా. వారిలో పోస్ట్గ్రాడ్యుయేట్లు 20 శాతం అంటే 2లక్షల 60వేలమంది గ్రాడ్యుయేట్లు 60 శాతం అంటే 7లక్షల 80వేల మంది ఇంటర్ విద్యార్థులు 20 శాతం మంది అంటే 2లక్షల 60వేలమంది ఉన్నారు. వీరందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.200కోట్లు.