ఛలో రామతీర్థం.. జాగ్రత్త.. రాష్ట్రం తగలబడిపోతుంది: విష్ణువర్ధన్ రెడ్డి సంచలనం
పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
శ్రీకాళహస్తి: బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఈ పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. రామతీర్థం కొండమీదికి టీడీపీ, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటూ ప్రభుత్వాన్ని,పోలీసులను నిలదీశారు.
''పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండి. పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా లేక రాష్ట్ర ప్రభుత్వమా. ఏపీలో మనవహక్కుల ఉల్లంఘన, పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాము. 60ఏళ్ల వయసున్న సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం జగన్ పరికిపంద చర్య. ఏపీలో పోలీసుల ప్రభుత్వం, పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులపైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము'' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
read more రామతీర్థం జంక్షన్ వద్ద ఉద్రిక్తత: సోము వీర్రాజు సహా బీజేపీ నేతల అరెస్ట్
ఏపీలో విగ్రహా విధ్వంస ఘటనలు రోజురోజుకూ ఉద్రిక్తతలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన చేపట్టిన ఛలో రామతీర్థం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమవుతుండగా, ఇప్పటికే కొందరిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు.
ఇందులో భాగంగానే సోము వీర్రాజుతోపాటు పలువురు భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.