చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో భగ్గుమన్న విభేదాలు: పరస్పర దాడులు
చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో చల్లా శ్రీలక్ష్మి, కుటుంబంలో మరో వర్గం పరస్పరం దాడులకు దిగారని ప్రచారం సాగుతుంది. చల్లా శ్రీలక్ష్మి , శ్రీదేవిలు ఆసుపత్రిలో చేరారు.
![Challa Srilakshmi and Challa Sridevi admitted in hospital after clashes within family lns Challa Srilakshmi and Challa Sridevi admitted in hospital after clashes within family lns](https://static-ai.asianetnews.com/images/01ety4wwds5f9y8tnzgtrcqene/mlc-challa-jpg-1200x630xt-jpg_363x203xt.jpg)
కర్నూల్: చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు వెలుగు చూశాయి.దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి బనగానపల్లి ఆసుపత్రిలో చేరారు. చల్లా శ్రీదేవి ఆవుకు ఆసుపత్రిలో చేరారు.
చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. 2021 జనవరి మాసంలో చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథ రెడ్డికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్ఆర్సీపీ) ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2022 నవంబర్ మాసంలో చల్లా భగీరథ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో చల్లా కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి.ఈ విషయమై వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చొరవ చూపారు.
చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చల్లా శ్రీలక్ష్మి ఒకవైపు మిగిలిన వారు మరో వైపు ఉన్నారనే ప్రచారం సాగుతుంది. ఇరు వర్గాల మధ్య గతంలో కూడ గొడవలు జరిగాయి.ఈ గొడవలు రచ్చకెక్కాయి. కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. చల్లా శ్రీలక్ష్మి బనగానపల్లి ఆసుపత్రిలో చేరారు. తనపై ఇతర కుటుంబ సభ్యులు దాడి చేసినట్టుగా శ్రీలక్ష్మి ఆరోపణలు చేస్తున్నారు.తనపై ఆడపడుచులు దాడి చేశారని శ్రీలక్ష్మి ఆరోపణలు చేస్తున్నారు.ఈ గొడవలను చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి అడ్డుకొనే ప్రయత్నం చేశారని చల్లా శ్రీలక్ష్మి ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమ ఆడపడుచులే తనపై దాడికి చేశారన్నారు.తన ఆడపడుచులు, వారి పిల్లలే ఈ దాడికి దిగారని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చల్లా శ్రీదేవి ఎలా గాయపడ్డారో తనకు తెలియదన్నారు. తాను ఆసుపత్రికి వెళ్లే సమయంలో కూడ చల్లా శ్రీదేవి ఇంట్లోనే ఉన్నారన్నారు. చల్లా శ్రీదేవి ఎలా గాయపడ్డారనేది తనకు తెలియదని ఆమె చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చల్లా రామకృష్ణారెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. చల్లా శ్రీలక్ష్మి ఆరోపణలపై ఇతర కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఈ విషయమై చల్లా శ్రీదేవి వర్గీయులు ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి,భగీరథ రెడ్డి మరణంతో ఈ కుటుంబంలో రాజకీయ వారసత్వంతో పాటు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రోజు రోజుకు ఈ గొడవలు పెరిగిపోతున్నాయి. తమ పంతం నెగ్గించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.