రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం
వైఎస్సార్సిపి ఎంఎల్ఏ రోజాకు తృటిలో ప్రమాదం తప్పింది. విషయం ఏమిటంటే, బుధవారం రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఇండిగో విమానం టైర్ పేలిపోవటంతో ప్రయాణీకుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది.
విమానం ల్యాండ్ అయి రన్ వే మీదున్నపుడు ఒక టైర్ పేలిపోవటంతో పెద్దగా శబ్దం వచ్చి విమానం ఒక్కసారిగి పెద్ద కుదుపుకు గురైంది. దాంతో ఏం జరిగిందో అర్ధంకాక ప్రయాణీకులు భయపడిపోయారు. దాంతో కొద్దిసేపు విమానమంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది.
అయితే, జరిగిన విషయాన్ని గమనించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేశారు. అదే సమయంలో టైర్ పేలిన విషయాన్ని విమాన సిబ్బంది కూడా గమనించారు. జరిగిన విషయాన్ని వివరించి ఆందోళన అవసరం లేదని ప్రయాణీకులకు సర్దిచెప్పటంతో అందరిలోనూ భయం తగ్గింది. ప్రయాణీకుల్లో వైసిపి ఎంఎల్ఏ రోజా కూడా ఉన్నారు.