వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు: రంగయ్య స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగురోజుల క్రితం వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అధికారులు విచారణ సాగిస్తున్నారు. 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచింది. నాలుగు రోజుల క్రితం వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.కడప గెస్ట్హౌజ్ కేంద్రంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ మధు, కిషోర్ కుమార్, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్ రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్ నాయక్ లను సీబీఐ విచారించింది.
also read:వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం: రంగయ్య చెప్పిన పేర్లలో ముగ్గురు వీరే
వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన డాక్టర్లను కూడ సీబీఐ విచారించింది. నిన్న సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకానందరెడ్డి హత్యకు గురైన ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు.సీబీఐ ఐజీ రామ్కుమార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 51 రోజులుగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, అల్లుడుతో పాటు వివేకా భార్యను కూడ సీబీఐ అధికారులు కలిసి కొన్ని వివరాలు సేకరించారు.