వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం: రంగయ్య చెప్పిన పేర్లలో ముగ్గురు వీరే
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రంగయ్య తన వాంగ్మూలంలో చెప్పిన ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఒకరైన సునీల్ యాదవ్ కోర్టుకెక్కారు.
కడప: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాచ్ మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. హత్యలో 9 మంది పాల్గొన్నట్లు ఆయన చెప్పాడు. ఆ తొమ్మిది మందిలో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శ్రీనివాసులు యాదప్ పెర్లను రంగయ్య చెప్పినట్లు బయటకు వచ్చింది.
వైఎస్ వివేకా హత్యకు 8 కోట్లు సుపారీగా ఇచ్చినట్లు ఆయన తెలిపాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సమకూర్చారనే విషయం తెలిస్తే కేసు చిక్కుముడి పూర్దిగా వీడే అవకాశం ఉంది. జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత రంగయ్యను సిబిఐ అధికారులు పులివెందుల బస్ స్టాండ్ వద్ద వదిలిపెట్టారు.
Also Read: వివేకా హత్య కేసులో సంచలనం: 8 కోట్ల సుపారీ, 9 మంది వ్యక్తులు
తన పేరు బయటకు చెప్తే నరికి చంపుతానని గంగిరెడ్డి బెదిరించాడని రంగయ్య ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణను గంగిరెడ్డి ఖండించారు. తనకు రంగయ్య ఎవరో తెలియదని, తనకు అతనితో పరిచయం లేదని ఆయన అన్నారు. తనను ఎంతో బాగా చూసుకున్న వివేకాను తాను ఎందుకు చంపుతానని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాను ఎవరినీ బెదిరించలేదని చెప్పారు.
కాగా, సునీల్ యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, తనను అరెస్టు చేయకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. సిబిఐ డైరెక్టర్ ను ఆయన ప్రితవాదిగా చేర్చారు. డిప్యూటీ సూపరింటిండెంట్ ఆధ్వర్యంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.