అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా వున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. 

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం, వైసీసీ అధినేత వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా, లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. అలాగే అందుకు 10 రోజుల గడువు ఇవ్వాల‌ని న్యాయస్థానాన్ని కోరింది. అయితే, సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది అభ్యంత‌రాలు తెలుపుతూ.. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని అన్నారు. వాదనలు విన్న అనంతరం కోర్టు త‌దుప‌రి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Also Read:జగన్ బెయిల్ రద్దు పిటిషన్: సాంకేతిక కారణాలతో విచారణ మరోసారి వాయిదా

గత గురువారం కూడా ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణంరాజు, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జగన్‌, రఘురామ గురువారం కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐకి ఇవాళ మధ్యాహ్నం వరకు గడువునిస్తూ సీబీఐ కోర్టు విచారణ వాయిదా వేయగా.. తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని సీబీఐ తెలిపింది. దీంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.