వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ: వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్లను ప్రశ్నిస్తున్న అధికారులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను రెండో రోజూ సీబీఐ అధికారులు మంగళవారం నాడు నిర్వహిస్తున్నారు.
కడప:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను రెండో రోజూ సీబీఐ అధికారులు మంగళవారం నాడు నిర్వహిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సోమవారం నాడు సీబీఐ అధికారులు ప్రారంభించారు. ఇవాళ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిని సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ మరోసారి మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం నాడు దస్తగిరిని విచారించారు.
also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: కారు డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ
వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై ఆయన కూతురు సునీతా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ అధికారులకు ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 2న వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత అదే నెల ఏప్రిల్ 12న సీబీఐ అధికారులు విచారణను ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత మళ్లీ సోమవారం నుండి సీబీఐ అధికారులు మరోసారి విచారణను ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఏప్రిల్ 18న లేఖ రాయడం చర్చకు దారితీసింది.వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు వరుసగా మరణించడంపై కూడ వివేకానందరెడ్డి కూతురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో సీబీఐ నోటీసులు అందుకొన్న వారిని అధికారులు విచారించే అవకాశం ఉంది.