రాజధాని భూములకు వాస్తు దోషమా ? ప్లాట్లు తీసుకోవటానికి నిరాకరిస్తున్న రైతులు
- అమరావతిలోని రాజధాని భూములకు వాస్తుదోషముందా?
- సిఆర్డీఏ కేటియించిన ప్లాట్లను తీసుకోవటానికి రైతులు నిరాకరిస్తున్నారా?
- ఇదే విషయమై సిఆర్డీఏ కార్యాలయంలో వందలాదిమంది రైతులు ఫిర్యాదులు కూడా చేసారా?
- క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.
అమరావతిలోని రాజధాని భూములకు వాస్తుదోషముందా? సిఆర్డీఏ కేటియించిన ప్లాట్లను తీసుకోవటానికి రైతులు నిరాకరిస్తున్నారా? ఇదే విషయమై సిఆర్డీఏ కార్యాలయంలో వందలాదిమంది రైతులు ఫిర్యాదులు కూడా చేసారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.
ఎందుకంటే, చంద్రబాబునాయుడు వాస్తు సిద్ధాంతాన్ని రాజధాని రైతులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కాబట్టి తమకు కేటియించే ప్రతీ ప్లాటునూ వాస్తుకు అనుగుణంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము ప్లాట్లను తీసుకునేది లేదని కూడా సిఆర్డీఏకి అల్టిమేటమ్ కూడా జారీ చేసారు. రైతుల పట్టుదల చూస్తుంటే ముందుముందు చంద్రబాబునాయుడుకు వాస్తుతో ‘తలనొప్పులు’ తప్పేలా లేవు.
ఇంతకీ విషయమేంటంటే, రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల పరిధిలోని వేలాది రైతుల పొలాలను చంద్రబాబు భూసమీకరణ క్రింద తీసుకున్నారు. అందులోనే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వాటికే ఒకటికి పదిసార్లు వాస్తు దోషాలున్నాయంటూ మరమ్మతులు చేస్తూనే ఉన్న విషయాన్ని కూడా అందరూ చూస్తున్నదే.
ఇక్కడే ప్రభుత్వానికి సమస్య మొదలైంది. భూసమీకరణలో భాగంగా ప్రభుత్వం 22,525 మంది రైతుల నుండి 33, 567 ఎకరాలను తీసుకున్నది. ఒప్పందంలో భాగంగా వారికి 56, 971 అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంచినీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ కేబుళ్ళు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా అభివృద్ధిలో భాగమేనని ప్రభుత్వం ఒప్పందంలో అంగీకరించింది. అయితే, ప్లాట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి సిఆర్డీఏ తనిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది.
రైతుల వద్ద తీసుకున్న భూములను ప్లాట్లుగా విభజించిన సిఆర్డీఏ తనిష్టం వచ్చినట్లుగా లే అవుట్లను వేసి రైతులను తీసుకోమంటోంది. అదికూడా క్షేత్రస్ధాయిలో ప్లాట్లను అందరికీ చూపకుండానే ప్లాట్ల కేటాయింపు అయిపోయిందని చెప్పింది. ప్లాట్ల కేటాయింపు అయిపోయింది కాబట్టి రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇక్కడే రైతులు ప్రభుత్వానికి అడ్డం తిరుగుతున్నారు. అధికారులు తమకందరికీ ప్లాట్లను చూపకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కుదరదని తేల్చి చెబుతున్నారు. ముందు తమకు క్షేత్రస్ధాయిలో ప్లాట్లను చూపించాల్సిందేనంటూ పట్టుపట్టారు. ఇంతలో సిఆర్డీఏ వర్గాల ద్వారా రైతులకు ఓ విషయం లీకైంది.
అదేంటంటే, రైతులకు కేటాయించిన ప్లాట్లన్నీ దక్షిణ దిక్కు ప్లాట్లేనట. అందులోనూ మొన్నటి వరకూ ఊర్లలో ఉన్న స్మశానాలను కూడా ప్లాట్లుగా విభజించేసి వాటిని కూడా రైతులకు కేటాయించేసింది సిఆర్డీఏ. విషయం తెలుసుకున్న రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
తమ భూములు తీసుకున్న చంద్రబాబేమో వాస్తు ప్రకారం అన్నీ చేయించుకుంటున్నపుడు భూములకు సొంతదారులమైన మాకు మాత్రం వాస్తు ప్రకారం ప్లాట్లు ఎందుకు కేటాయించారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై సిఆర్డీఏ కార్యాలయంలో రచ్చ రచ్చ కూడా చేసారు. దాంతో రాజధాని భూముల్లో వాస్తుదోషాలున్నాయన్న విషయం బాగా ప్రచారమై చుట్టుపక్కల కలకలం మొదలైంది.