నరసరావుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జున్ రావు బుధవారం తెల్లవారుజామున స్కూటీపై వెళుతుండగా దుండగులు నరికిచంపారు. 

గుంటూరు జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త దారుణ హత్య కలకలం రేపింది. తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని నడిరోడ్డుపైనే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో నరసారావుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నరసరావుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జున్ రావు బుధవారం తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లాడు. అయితే అప్పటికే కాపుకాసిన దుండగులు వాకింగ్ కు వచ్చినవారు చూస్తుండగానే అతడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో అతడు పారిపోతుండగా వెంటాడి వెంటాడి కత్తులతో ప్రాణాలు పోయేవరకు నరికారు. 

వీడియో

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు ముడుగులో పడివున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాపారి హత్యకు ఆర్ధిక లావాదేవీలు లేదా పాత కక్షలు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

read more కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పలువురు కార్మికులకు అస్వస్థత

ఈ దారుణ హత్యగురించి తెలిసినవెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవింద బాబు మరియు నియోజకవర్గ టీడీపీ నేతలు. వ్యాపారి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి మర్డర్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

''ప్రశాంతంగా ఉండే నరసరావుపేటలో నిత్యం ప్రజలు వాకింగ్ చేసే ప్రాంతంలో ఇలాంటి హత్య జరగడం దుర్మార్గం. పోలీసు అధికారులు వెంటనే దోషులను గుర్తించి అరెస్టు చేయాలి. అదే విధంగా పట్టణ శివారు ప్రాంతాల్లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. పోలీసులు అధికారులు గస్తీ నిర్వహించి ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి'' అని చదలవాడ పోలీసులను కోరారు.