కెసిఆర్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధపడటానికి కారణం ‘అదేనా’ ?
- ఆస్తులు కాపాడుకునేందుకే ఏపి టిడిపిలోని పెద్దలు తెలంగాణా కెసిఆర్ తో పొత్తుకు మద్దతు పలుకుతున్నారా ?
- తాజాగా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బయటపెట్టిన విషయాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
- ఎందుకంటే, 2014కు ముందు వరకూ సమైక్య రాష్ట్రంలోని టిడిపి పెద్దల్లో చంద్రబాబుతో కలుపుకుని అత్యధికులకు హైదరాబాద చుట్టుపక్కలే ఆస్తులున్నాయి.
- హైదరాబాద్ లోనే వ్యాపారాలున్నాయి.
ఆస్తులు కాపాడుకునేందుకే ఏపి టిడిపిలోని పెద్దలు తెలంగాణా కెసిఆర్ తో పొత్తుకు మద్దతు పలుకుతున్నారా ? తాజాగా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బయటపెట్టిన విషయాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే, 2014కు ముందు వరకూ సమైక్య రాష్ట్రంలోని టిడిపి పెద్దల్లో చంద్రబాబుతో కలుపుకుని అత్యధికులకు హైదరాబాద చుట్టుపక్కలే ఆస్తులున్నాయి. హైదరాబాద్ లోనే వ్యాపారాలున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే, వెంటనే ‘ఓటుకునోటు’ కేసు బయటపడటంతో చంద్రబాబునాయుడు పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా విజయవాడ వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏంటంటే, టిడిపిలోని పలువురు పెద్దలకు హైదరాబాద్, చుట్టపక్కలే ఫాం హౌసులు, ఇతరత్రా ఆస్తులున్నాయి. అంతేకాకుండా వారి వ్యాపారాలు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. అవన్నీ అర్ధాంతరంగా వదిలి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బందే. అందుకనే మెజారిటీ నేతలు హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అయితే, వ్యక్తిగతంగా తనకు భద్రత లేదని భయపడిన చంద్రబాబు మకాంను విజయవాడకు మార్చేసారు. దాంతో ఏమీ చేయలేక మిగిలిన వారు కూడా అనుసరించారు. ఇది జగమెరిగిన వాస్తవం.
అయితే, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, చంద్రబాబు మధ్య తీవ్రస్ధాయిలో వైరమున్నా పలువురు ఏపి టిడిపి నేతలు మాత్రం లోలోపలే కెసిఆర్ తో మంచి సంబంధాలే కలిగి ఉన్నారన్నది రేవంత్ మాటలను బట్టి అర్ధమవుతోంది. లేకపోతే ఏపిలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడికి కెసిఆర్ రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వటమేంటి ? ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ అల్లుడు, పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ బీరు కంపెనీకి లైసెన్సు ఎలా ఇస్తారు కెసిఆర్ ?
ముందే చెప్పుకున్నట్లు తమ వ్యాపారలు భద్రంగా ఉండాలంటే, కెసిఆర్ తో మంచిగా ఉండక తప్పదన్న విషయం నేతలకు బాగా తెలుసు. అందుకే చంద్రబాబుతో సంబంధం లేకుండానే వీలైనంత మంది నేతలు కెసిఆర్ తో లోపాయికారీగా టచ్ లోనే ఉన్నారని అనిపిస్తోంది. ఇప్పటికి బయటపడిన పేర్లు యనమల, పరిటాల సునీత, పయ్యావులవి మాత్రమే. భవిష్యత్తులో ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయో?
రాజకీయంగా ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టే, ముందు జాగ్రత్తగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కెసిఆర్ తో పొత్తు పెట్టుకోవాలని టిడిపి ముఖ్యులు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్నే రేవంత్ సూటిగా అడుగుతున్నారు. మొత్తానికి చంద్రబాబు దేశంలో లేని సమయం చూసుకుని మొత్తం ఏపి టిడిపిని రేవంత భలే ఇబ్బందుల్లోకి నెట్టేసారు.