ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం.. వివరాలు ఇవే..
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా స్వాభిమాన్ అంచల్లోని తైమల్ అడవుల్లో భారీ పేలుడు పదార్థాల నిల్వ ఉన్న మావోయిస్టుల డంప్ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాకమమూడి గ్రామపంచాయతీ పరిధిలోని లారిగూడ, తైమల్ గ్రామం మధ్య ఉన్న సాధారణ ప్రాంతంలోని బలిమెల రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల డంప్ను బీఎస్ఎఫ్ ఆపరేషనల్ పార్టీ గురువారం విజయవంతంగా రికవరీ చేసినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో మావోయిస్టులో ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, తుపాకులను డంప్లో దాచారని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఆ
డంప్ నుంచి ఒక తుపాకీ, 2 ఖాళీ ఎస్బీఎంఎల్ షెల్లు, 11 హ్యాండ్ గ్రెనేడ్లు, 28 డిటోనేటర్లతో పాటు 3 స్టీల్ టిఫిన్ బాక్స్లు, మావోయిస్టులు ఉపయోగించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
భౌగోళిక కారణాలు, అనుకూలమైన వాతావరణం కారణంగా బలిమెల రిజర్వ్ ఫారెస్ట్ చాలా కాలంగా మావోయిస్టులకు సురక్షితమైన స్వర్గధామంగా ఉందని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టడానికి, స్థానిక ప్రజలలో భద్రతా భావాన్ని సృష్టించడానికి భద్రతా దళాలు, పోలీసుు చరుకుగా పనిచేస్తారని బీఎస్ఎఫ్ తెలిపింది. మావోయిస్టుల భావజాలం ఇకపై వ్యాప్తి చెందకుండా చర్యలు ఉంటాయని పేర్కొంది.
కొనసాగుతున్న సహీద్ దివాస్ (మార్చి 23న మావోయిస్టుల సంస్థచే గుర్తించబడింది) సందర్భంగా ఐఈడీలు, పేలుడు పదార్థాలతో కూడిన భారీ డంప్ను స్వాధీనం చేసుకోవడం ఖచ్చితంగా మావోయిస్టులను, వారి సానుభూతిపరులను నిరుత్సాహపరుస్తుందని బీఎస్ఎఫ్ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో మరింత చురుగ్గా పనిచేసేలా భద్రతా బలగాలను కూడా ప్రేరేపిస్తుందని పేర్కొంది.
‘‘స్థానిక ప్రజలలో అధిక భద్రతా భావాన్ని అందించడానికి బీఎస్ఎఫ్ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో నిర్వహించబడే మరిన్ని కార్యకలాపాల ద్వారా మల్కన్గిరిలోని సుదూర ప్రాంతాల వరకు అభివృద్ధి పథకాలను విస్తరించడానికి సహాయం చేస్తుంది’’ బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.