ప్రియురాలిపై బ్లేడ్తో దాడి.. నగదు పట్టుకుని ఉడాయించిన నిందితుడు
గుంటూరు పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు విజయనగరం నుంచి వచ్చిన ప్రియురాలిపై బ్లేడ్తో దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్ను పట్టుకుని పరారయ్యాడు. ఆ యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. కాగా, కృష్ణా జిల్లాల్లో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తాళలేక 35ఏళ్ల నాగలక్ష్మీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది. ఇందులో చిన్నమ్మాయి ప్రాణాలు కోల్పోగా తల్లి, పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు.
అమరావతి: గుంటూరు (Guntur) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని నట్టేట ముంచాడు ఆ యువకుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు (Money) తో రమ్మన్నాడు. తీరా తన దగ్గరకు వచ్చాక యువతిపై బ్లేడ్ (Blade)తో దాడి చేసి నగదు పట్టుకుని పరారయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
విజయనగరానికి చెందిన యువతితో శ్రీకాంత్కు కొంత కాలంగా పరిచయం ఉన్నది. అదే పరిచయాన్ని ప్రేమగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. తన దగ్గరకు వచ్చేయమన్నాడు. ఇవన్నీ నిజమని నమ్మిన ఆ యువతి విజయనగరం నుంచి గుంటూరు వచ్చింది. కానీ, తీరా ఆ యువతి తన దగ్గరకు వచ్చాక ప్లేట్ ఫిరాయించాడు. ఆ యువతిపై బ్లేడ్తో దాడి చేశాడు. అనంతరం ఆమె తెచ్చిన నగదు గల బ్యాగ్ను పట్టుకుని పరారయ్యాడు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రస్తుతం గాలింపులు జరుపుతున్నారు. గాయపడ్డ యువతి ఇప్పుడు ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
Also Read: చీమల మందు తాగి భార్య ఆత్మహత్యాయత్నం.. తన మీద ఫిర్యాదు చేసిందని రైలు కిందపడి భర్త ఆత్మహత్య..
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. నూజివీడు పట్టణం గొడుగువారి గూడెంలో దైదా నాగలక్ష్మీ తన ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ రోజు ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. చిన్నమ్మాయి కావ్య(7) మరణించింది. కాగా, పెద్దమ్మాయి కర్ణిక(9)ను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్లో దైదా నాగలక్ష్మికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భర్త లేక కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరిగాయని, వాటికి తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్టు తెలిసింది. ఘటనా స్థలికి పోలీసులు చేరారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు.