బిందెలో ఎలుక పడిన కలుషిత నీటిని తాగి.. ఆరేళ్ల బాలుడి మృతి..!
బిందెలో ఎలుకపడిన నీటిని తాగి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గుంటూరులో కలకలం రేపింది.
గుంటూరు : గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ చచ్చిన ఎలుక ఆరేళ్ల చిన్నారి మృతికి కారణమయ్యింది. వివరాల్లోకి వెడితే.. నీటి బిందెలో ఓ ఎలుక పడడంతో ఆ నీరు కలుషితమయ్యింది. ఆ కలుషితమయిన నీటిని ఓ చిన్నారి తాగాడు. దీంతో గుంటూరు గ్రామీణ మండలం చల్లావారిపాలెంకు చెందిన ఉసర్తి ప్రభు దివ్య తేజ (6) అస్వస్థతకు గురయ్యాడు. ఆ చిన్నారి జీజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
ఆ చిన్నారి ఇంట్లోని నీటి బిందెలో ఎలుక పడింది. అందులోనే అది చనిపోయింది. ఇది తెలియని చిన్నారి తేజ ఆ నీరు తాగాడు. దీంతో వెంటనే వాంతులయ్యాయి. ఇది గమనించిన కుటుంసభ్యులు తేజను వెంటనే జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి తేజ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ప్రకారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మేలో జార్ఖండ్లో ఇలాంటి ఘోర ఘటనే జరిగింది. గిరిధ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కొరికాయి. దీంతో ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు బాద్యులను చేస్తూ ఇద్దరు నర్సులను ప్రభుత్వం విధుల్లోంచి తొలగించింది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.
వివాహేతర సంబంధం.. ప్రియుడి సాయంతో భర్తను చంపి.. గోతాంలో కుక్కి, నక్కల కాలువలో పడేసిన భార్య..
ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మే 2వ తేదీన గిరిధ్ సదర్ ఆసుపత్రిలో జరిగింది. ఆ నవజాత బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్బాద్లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. నాలుగు రోజులకు శిశువు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తల్లి మమతా దేవి మాట్లాడుతూ.. గిరిధి ఆసుపత్రిలోని మోడల్ మాతా శిశు ఆరోగ్య వార్డులో తన బిడ్డను చూడటానికి వెళ్లినప్పుడు పాప మోకాలిపై ఎలుకలు కొరకడం వల్ల లోతైన గాయాలు కనిపించాయని, వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చానని తెలిపారు.
బాధిత శిశువు ఏప్రిల్ 29వ తేదీన జన్మించింది. కానీ, పుట్టిన తర్వాత పాపకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆ పాపను ఎమ్ సీహెచ్ లో చేర్చారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించిందని, డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో పీడియాట్రిక్స్ విభాగం అధిపతి అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. శిశువు మోకాలిపై గాయం ఉందని తెలిపారు. ఒక సర్జన్ పాపను జాగ్రత్తగా చూసుకునేందుకు కేటాయించామని చెప్పారు. అయితే ఆ గాయాలు ఎలుక కొరకడం వల్లే అయ్యాయని చెప్పలేనని, అలాగని కాదని కూడా చెప్పలేనని అన్నారు.
కాగా గిరిధ్ సదర్ హాస్పిటల్ లో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రటరీకి లేఖ పంపినట్లు గిరిదిహ్ డిప్యూటీ కమిషనర్ నమన్ ప్రియేష్ లక్రా తెలిపారు. ఆ ఆసుపత్రిలోని ఇద్దరు ఔట్ సోర్సింగ్ జీఎన్ఎంల (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సిబ్బంది సేవలను రద్దు చేశామని చెప్పారు. నవజాత శిశువు ఉన్న వార్డు స్వీపర్ను తొలగించామని, ఏఎన్ఎంను సస్పెండ్ చేసినట్లు లక్రా తెలిపారు.