ఇద్దరూ సమాధానం చెప్పాల్సిందే
‘రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసినందుకు, విభజన హామీలను అమలు చేయనందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రజలకు సమాధానాలు చెప్పాలి’..ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన డిమాండ్. ఢిల్లీలోని జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు జనాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధత ప్రధానమంత్రిపై ఉందన్నారు.
నిజమే పోయిన ఎన్నికల సమయంలో జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు జనాలకు సమాధానాలు చెప్పాల్సిందే. అయితే, సమాధానం చెప్పాల్సింది ఒక్క మోడి మాత్రమేనా? చంద్రబాబుకు బాధ్యత లేదా? ఎందుకంటే, పోయిన ఎన్నికల సమయంలో జనాలకు హామీ ఇవ్వటంలో మోడి పాత్ర ఎంతో చంద్రబాబు పాత్ర కూడా అంతే ఉంది.
ఎన్నికల సమయంలో జనాలను ఆకర్షించటం కోసం మోడి, చంద్రబాబు కలిసే కాకుండా విడివిడిగా కూడా ఎన్నో హామీలిచ్చారు. బిజెపితో కలిసి ఇచ్చిన హామీలను పక్కనబడితే చంద్రబాబు విడిగా ఇచ్చిన హామీల మాటేంటి? అధికారంలోకి రావటమే లక్ష్యంతో దాదాపు 600 హామీలిచ్చారు కదా? అందులో ఎన్ని పూర్తిగా అమలయ్యాయి? వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై లేదా?
తానిచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారో ముందు జనాలకు సమాధానాలిచ్చిన తర్వాత మోడిని ప్రశ్నిస్తే బాగుంటుంది. తానిచ్చిన హామీల అమలు గురించి జనాలకు సమాధానాలు చెప్పకుండా మోడిని ప్రశ్నించే నైతికత చంద్రబాబుకుందా?