జగన్ సొంత జిల్లాలో కలకలం: జమ్మలమడుగులో 54 నాటు బాంబులు స్వాధీనం
పొలిటీషయన్ కు చెందిన 14 ఎకరాల భూమిని పురుషోత్తమ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. కొత్తగా వెంచర్ వేసేందుకు నేలను చదును చేస్తుండగా భూమిలో ఒక బకెట్ లో నాటుబాంబులు కనిపించాయి.
కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మరోసారి నాటుబాంబులు కలకలం రేపాయి. ముద్దనూర్ రోడ్ నెంబర్ 8 దగ్గర 14 నాటుబాంబుల లభ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ వెంచర్ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తుండగా 54 బాంబులు ప్రత్యక్షమయ్యాయి.
వెంచర్ నిర్మాణ పనుల్లో భాగంగా భూమిని చదును చేస్తున్న కొద్దీ బాంబులు బయటపడుతున్నాయి. ఇకపోతే నూతనంగా వేయబోతున్న ఈ వెంచర్ స్థానికంగా ఉన్న ఒక నాయకుడిదిగా పోలీసులు గుర్తించారు. బాంబులు ఆ పొలిటీషియన్ కు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పొలిటీషయన్ కు చెందిన 14 ఎకరాల భూమిని పురుషోత్తమ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. కొత్తగా వెంచర్ వేసేందుకు నేలను చదును చేస్తుండగా భూమిలో ఒక బకెట్ లో నాటుబాంబులు కనిపించాయి.
దాంతో అవాక్కైన పురుషోత్తమ్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో మెుత్తం 54 నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ నాటుబాంబులు ఎందుకు తెచ్చి ఉంటారా అన్న దానిపై పోలీసులు ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. గడచిన ఎన్నికల కోసం తెచ్చారా లేక ఏ ఇతర కార్యక్రమాలకైనా తెచ్చి దాచి ఉంచారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
వరుసగా నాటు బాంబులు బయటపడుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కడప జిల్లాలో నాటు బాంబులు పేలడం జరుగుతుండేవని అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా నాటు బాంబులు ప్రత్యక్షమవ్వడంపై స్థానికుల్లో ఆందోళన మెుదలైంది.
ఇకపోతే గత పది రోజుల క్రితం జమ్మలమడుగులోని ఒక పొలంలో గట్టును చదును చేస్తుండగా ఇలాగే నాటు బాంబులు ప్రత్యక్షమవ్వడం అప్పట్లో ఒక్కసారిగా భయాందోళన చెలరేగాయి.