ఏపీలో బీజేపీ ప్లాన్ ఇదే: టీడీపీ నేతలకు గాలం
: ఏపీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కానీ, టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది
అమరావతి: ఏపీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కానీ, టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఏడాదిలోపుగానే ఈ ఆపరేషన్ను పూర్తి చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకొంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓంటరిగాపోటీ చేసి 23 స్థానాలకే పరిమితమైంది. వైసీపీకి 151 స్థానాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో దెబ్బతినడానికి ప్రధానంగా టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం కూడ కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది.
ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయాడు. ఏపీలో చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలనేది బీజేపీ వ్యూహం. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బీజేపీ లక్ష్యం నెరవేరింది.
ఇదిలా ఉంటే ఏడాది లోపుగా టీడీపీకి చెందిన కీలక నేతలకు గాలం వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీడీపీలో కీలకంగా పేరొందిన నేతలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్టుగా సమాచారం.
ఏపీ రాష్ట్రంలో కీలకమైన టీడీపీ నేతల జాబితాను సిద్దం చేసుకొని బీజేపీ చర్చలను ప్రారంభించినట్టుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు.
పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కూడ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. ఈ ప్రచారాన్ని రామానాయుడు ఖండించారు. వైసీపీతో పాటు బీజేపీ వ్యూహలను తట్టుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితులు చంద్రబాబుపై ఉన్నాయి.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ అగ్ర నేత రామ్ మాధవ్ ఏపీపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. రానున్న ఏడాదిలో పార్టీని బలోపేతం చేసే దిశగా రామ్ మాధవ్ వ్యూహ రచన చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు.