టీడీపీ పాపాల చిట్టా నా వద్ద ఉంది, బయటపెడతా: జీవీఎల్ సంచలనం
టీడీపీ పాపాల చిట్టా తన వద్ద ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ పాపాలను బయటపెడతానని హెచ్చరించారు
న్యూఢిల్లీ: టీడీపీ పాపాల చిట్టా తన వద్ద ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ పాపాలను బయటపెడతానని హెచ్చరించారు.
మంగళవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీని టోటల్ డ్రామా పార్టీగా ఆయన అభివర్ణించారు. అవకాశం దొరికితే టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతారని ఆయన ధ్వజమెత్తారు.
మూడు నెలల నుండి టీడీపీ నేతలు అబద్దాలు, డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కావాలంటూ దొంగ దీక్షలు చేస్తూ మరో వైపు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని ఉత్తరాలు రాస్తున్నారని జీవీఎల్ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల పాపాల చిట్టా తన వద్ద ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ పాపాల చిట్టాను బయటపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.
‘తెలుగుదేశం డ్రామాలను ప్రజలకు చూపించాం. కేంద్రం నుంచి నిధులను తీసుకుంటూ డ్రామాలు ఆడుతోంది. స్పెషక్ ప్యాకేజీని తీసుకుంటూ... మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్యాకేజీ అద్భుతం అన్నారు. ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారని టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు.
1500 రోజులుగా ప్రజలు టీడీపీని భరిస్తున్నారని జీవీఎల్ చెప్పారు.2019లో ఏపీలో టీడీపీ గెలవడం కల్ల అని ఆయన అభిప్రాయపడ్డారు.టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చకు తాము రెడీగా ఉన్నామన్నారు.