ఏపీ మంత్రుల అవినీతిని బట్టబయలు చేస్తాం: సోము వీర్రాజు
బాబుపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు
విశాఖపట్టణం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడుకు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసింది బిజెపి మాత్రమేనని ఆయన చెప్పారు.
బుధవారం నాడు ఆయన విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేకపోతే చంద్రబాబునాయుడు జీరో అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తోందని ఆయన చెప్పారు.
రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ తప్పక వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రుల అవినీతిని బట్టబయలు చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 9 ఏళ్ళ పాటు సీఎంగా ఉన్న కాలంలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.