రూ.30వేల కోట్ల అవినీతి, బాబుపై కేసు: సోము వీర్రాజు సంచలనం
బాబుపై సోము వీర్రాజు హట్ కామెంట్స్
కడప: నీరు-చెట్టు, హౌజింగ్ స్కీమ్ లో సుమారు రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. చంద్రబాబునాయుడు అవినీతిపై విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
కడప జిల్లాలో సోమవారం నాడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడుతూ ధర్మపోరాటం పేరుతో చంద్రబాబునాయుడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదన్నారు. కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి ఎందకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై నోరు తెరవాలని బాబును ఆయన డిమాండ్ చేశారు.
కడపలో ఉక్కు ప్యాక్టరీ విషయమై టిడిపి ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేయాలని భావించడం సరైంది కాదన్నారు. నాలుగేళ్ళుగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం గురించి సీఎం రమేష్ ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో చక్కెర, పాల కేంద్రం గురించి సీఎం రమేష్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.