ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని సీఎం జగన్‌పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్థన్ రెడ్డి. తమకు ప్రత్యేక హోదా వద్దని 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని విష్ణువర్థన్ రెడ్డి గుర్తుచేశారు

ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరుతో ఇంకెన్నాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారంటూ మండిపడ్డారు. తమకు ప్రత్యేక హోదా వద్దని 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని విష్ణువర్థన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్యాకేజీ కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 17 ప్రాజెక్ట్‌లు ఇచ్చామని.. అందుకు గాను రూ.7,798 కోట్ల నిధులు తీసుకుందని కూడా కేంద్రం చెప్పిందని ఆయన వెల్లడించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరి ఈ 17 ప్రాజెక్ట్‌లు తీసుకోలేదని.. రూ.7,798 కోట్లను కూడా తీసుకోలేదని సీఎం జగన్ ప్రకటిస్తారా అని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై మాట్లాడతారా అంటూ ఆయన చురకలు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి విశాఖ- చెన్నై కారిడార్‌కు రూ.1,859 కోట్లు, నాడు- నేడు ఆరోగ్య మిషన్‌కు రూ.935 కోట్లు, పవర్ ప్రాజెక్ట్‌లకు రూ.897 కోట్లు, గ్రామీణ రహదారులకు సంబంధించి రూ.825 కోట్లు ఇచ్చిందని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. 

Also Read:ఏపీకి ప్రత్యేకహోదా .. అది ముగిసిన అధ్యాయం : పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై (ap special status) మరోసారి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్ (union minister nityanand rai) ఇటీవల పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో టీడీపీ (tdp) ఎంపీ రామ్మోహన్ నాయుడు (rammohan naidu) అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానం తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. అయితే విభజన చట్టంలో మరికొన్ని హామీలు మాత్రం మిగిలే వున్నాయని కేంద్రం అంగీకరించింది. రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.