రూ.2000 నోటు ఉపసంహరణ.. నష్టం వారికే : బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. నల్లధనం పేరుకుపోయిన వారికి ఇబ్బందులు తప్పవని ఆయన పేర్కొన్నారు.
రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై దేశంలో మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ , ఎన్డీయే నేతలు ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తోండగా.. విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఎరగా వేసి ఓట్లు కొనుక్కుందామని అనుకుంటున్న పార్టీలకు రూ.2 వేల నోటు ఉపసంహరణతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్య పర్యవేక్షణ సాధ్యమన్న విష్ణుకుమార్ రాజు.. నల్లధనం పేరుకుపోయిన వారికి తప్పించి.. రూ.2 వేల నోటు ఉపసంహరణ వల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం లేదన్నారు. పెద్ద నోట్ల కారణంగా ఏర్పడే సమస్యలను తాను గతంలోనే ఆర్బీఐకి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని ఆయన గుర్తుచేశారు. ఇక తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని విష్ణుకుమార్ రాజు ఖండించారు. పొత్తులపై హైకమాండ్దే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: మీ దగ్గరున్న రెండు వేల రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలంటే..?
ఇకపోతే.. 2000 వేల రూపాలయ నోటుపై తాము తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆర్బీఐ తెలిపింది. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ వద్ద ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవచ్చునని భరోసా ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నోట్లను ఇప్పట్లో జారీ చేయబోమని ఆర్బీఐ చెప్పడంతో పాటు చలామణిలో ఉన్న నోట్లను ఉపసంహరించుకునే కసరత్తు కూడా ప్రారంభమైంది.
నోట్ల రద్దు ప్రకటన తర్వాత మరోసారి సామాన్యుల మదిలో నోట్లరద్దు శకం మొదలైంది. నోట్ల మార్పిడి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు, గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆందోళనలు ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు గరిష్టంగా 10 రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అయితే మీ దగ్గర ఎన్ని రెండు వేల రూపాయల నోట్లు ఉన్నా వాటిని ఎలా డిపాజిట్ చేయాలో కూడా ఆర్బీఐ వివరించింది.