తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌లు మరోసారి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌లు మరోసారి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి అంతగా ఆసక్తి కనబరచలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీపై తానెందుకు స్పందించాలని ఆమె ప్రశ్నించారు. వారు భేటీ అయితే వారే మాట్లాడుకుంటారని అన్నారు. 

ఇదిలా ఉంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు , పవన్ భేటీ గురించి తెలియదన్నారు. పొత్తుల అంశంపై నాదెండ్ల మనోహర్‌ను అడగాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. మోడీని చంద్రబాబు పొగడటం సంతోషమని చెప్పారు. 

Also Read: వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి రావాలి: నాదెండ్ల మనోహర్

ఇక, పవన్ కల్యాణ్ శనివారం రోజున హైదరాబాద్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం సాగింది. గత కొద్ది నెలల కాలంలో ఇరువురు నేతలు భేటీ కావడం ఇది మూడోసారి. అయితే ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్.. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేంద్ర మంత్రి వి మురళీధరన్‌లతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. 

అయితే ఈ పరిణామం చోటుచేసుకున్న మూడు వారాల తర్వాత పవన్ నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు కూడా.. ఏపీలో అధికార వైసీపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అలాగే రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చలు సాగినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పలు సందర్భాల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కొవాలంటే.. బీజేపీ మద్దతు అవసరం అని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.