వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి రావాలి: నాదెండ్ల మనోహర్
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
![We will Continue to Discuss With Chandrababu : Nadendla Manohar lns We will Continue to Discuss With Chandrababu : Nadendla Manohar lns](https://static-ai.asianetnews.com/images/01fxwwrbjca3ff49djqt4ann8w/nadendla-jpg_363x203xt.jpg)
అమరావతి: భవిష్యత్తులో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదికపైకి రావాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఆదివారంనాడు అమరావతిలోని త మ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది తమ లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారన్నారు. ఇందులో భాగంగానే నిన్న హైద్రాబద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారని చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏపీలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధన దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.
సీఎం జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే అక్కదే పాలన అని సీఎం జగన్ ప్రకటించడాన్ని నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.
పదవుల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ప్రత్యేక మెనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.