ఏపీలో ఖజానా ఖాళీ .. ప్రభుత్వం దివాళా , జగన్ బయటకే రావట్లేదు : బీజేపీ నేత అరుణ్ సింగ్
ఏపీలోని వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ (arun singh) మండిపడ్డారు. ఏపీలో ప్రతి నెలా 1న జీతం రావడం లేదని.... పింఛన్ ఇవ్వడం లేదని రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దివాళా తీసింది అంటూ అరుణ్ సింగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు
ఏపీలోని వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ (arun singh) మండిపడ్డారు. ఏపీలో ప్రతి నెలా 1న జీతం రావడం లేదని.... పింఛన్ ఇవ్వడం లేదని రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దివాళా తీసింది అంటూ అరుణ్ సింగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ (prc) ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని అరుణ్ సింగ్ డిమాండ్ చేశారు.
ఏపీలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. అఖిలేష్ (akhilesh yadav) హయాంలో యూపీ మంత్రి అజాం ఖాన్ (azam khan) చాలా ఏళ్లుగా జైలులో వున్నారని, ఎన్ని నేరాలు చేసినా ముస్లింలపై చర్యలు తీసుకోరాదన్నారు. దీని ఫలితమే యూపీ మంత్రి అజాం ఖాన్ జైలులోనే వున్నారని అరుణ్ సింగ్ గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అడ్డుకునేందుకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించమని, వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని అరుణ్ సింగ్ డిమాండ్ చేశారు.
ఏపీలో పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన వారిపై తక్కువ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... బీజేపీ నేతలపై మాత్రం తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలోకి రావడం కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్... సీఎం అయిన తర్వాత జనంలోకి రావడం లేదని అరుణ్ సింగ్ దుయ్యబట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా జగన్ కలవడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే... జగన్ తన లేబుల్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.