ఎపి బిజెపి సిఎం అభ్యర్థి జెడి లక్ష్మినారాయణ?
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతారని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి.
తిరుపతి: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతారని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఆయన బిజెపిలో చేరుతారని తాజాగా మరో పుకారు పుట్టింది. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నోటి వెంట వచ్చిన మాటే దానికి కారణమైంది.
బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా జెడి లక్ష్మినారాయణ కావచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణా.. కన్నా లక్ష్మీనారాయణా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కన్నా ఇచ్చిన సమాధానం ఆ చర్చకు దారి తీసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరిని నిర్ణయిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని కన్నా చెప్పారు. 2019లో ఏపీ ప్రజల విశ్వాసాన్ని పొందుతామని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజల ముందున్న అపోహలను తొలగిస్తామని చెప్పారు.
ఈ మధ్య ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఓ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన సంఘ్ వ్యక్తి అనే మాట కూడా వినిపిస్తోంది. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.